బ్రహ్మంగారిమఠం : మండలంలోని పలుగురాళ్లపల్లె, పాపిరెడ్డిపల్లె రెవెన్యూ పొలంలోని ప్రభుత్వ భూములు 175 ఎకరాలు, ఆన్లైన్ భూములు 168 ఎకరాలు ఎకోరెన్ సోలార్ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వ భూమిలో చెంచయ్యగారిపల్లె, ఎద్దులాయపల్లె, మల్లేపల్లె ఎస్సీ కాలనీకు చెందిన రైతులు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వ పరంగా రైతుల వద్ద ఆధారాలు లేకపోవడంతో ఎకోరెన్ కంపెనీకి 175 ఎకరాలు ప్రభుత్వం లీజ్కు ఇచ్చింది. దీంతో నిర్మాణ పనులను శనివారం భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న జేసీ డాక్టర్ నిధిమీనా, బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ ఘటనాస్థలికి చేరుకుని రైతులకు సర్ధిచెప్పారు. రైతులకు పరిహారం అందేలా చూస్తామని జేసీ హామీ ఇచ్చారు. తమపై కంపెనీ ప్రతినిధి శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారని జేసీకి రైతులు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ కార్తీక్, మండల ఇన్చార్జి సర్వేయర్ స్వాతి, టీడీపీ మండల అధ్యక్షుడు సి.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య
పుంగనూరు : అప్పులబాధతో ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం పోలీసులు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని సుల్తాన్సాబ్వీధిలో నివాసం ఉన్న మహమ్మద్రఫి (35) పలువురి వద్ద అప్పులు చేశారు. ఈ క్రమంలో అప్పు ఇచ్చినవారి వేధింపులు తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అన్సర్బాషా తెలిపారు.


