మదనపల్లె సిటీ: ఈసారి ఎండలు ఆరంభం నుంచే మండుతున్నాయి. ఉష్ణతాపం తీవ్రమవుతుండటంతో జంతుజాలం దాహంతో అల్లాడుతోంది. మనుషులైతే దప్పిక వేసినప్పుడు ఎలాగోలా గొంతు తడుపుకొంటారు. కానీ మూగజీవాలకు ఇబ్బందిగా ఉంటుంది. నీటి వనరుల్లో జలం అడుగంటడంతో సులభంగా దాహార్తి తీరదు. ఈ నేపథ్యంలోమనుషులే స్వచ్చందంగా జీవకారుణ్యం ప్రదర్శించాలి. గుక్కెడు నీళ్లు, గుప్పెడు గింజలు ఇంటి ఆవరణంలో అందుబాటులో ఉంచితే పక్షులు చెంగుచెంగున వచ్చి నీటితో గొంతు తడుపుకొంటాయి. ఇప్పటికే కొందరు ఈ మంచి పనిని ప్రారంభించారు. మరింత మంది భాగస్వాములైతే బాగుంటుంది.
ఆదర్శం....హెల్పింగ్మైండ్స్ :
మదనపల్లె పట్టణంకు చెందిన హెల్పింగ్మైండ్స్ సంస్థ ప్రతినిధులు ప్రతి ఏడాది వేసవి ప్రారంభంలో వాటర్ బౌల్ కార్యక్రమం అమలు చేస్తున్నారు. పలువురికి వాటర్బౌల్లను ఉచితంగా అందజేసి దాని ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. మహిళలకు దీని గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఇంటి ఆవరణంతో పాటు ఇంటి మిద్దెలపైకి నీళ్లు ఉంచడంతో పాటు గుప్పెడు గింజలు పెట్టాలని చెబుతున్నారు. అంతే కాకుండా సభ్యులందరూ కలిసి పరిసర ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలకు వెల్లి వాటర్ సాసర్లు ఏర్పాటు చేసి నీళ్లు నింపుతున్నారు. ఇది ఒకరి నుంచి మరొకరికి చేరి మూగజీవాల గొంతు తడిపేందుకు వారధిగా నిలుస్తోంది. ఎంతో మంది తమ గుమ్మాల ముందు గింజలు పోసి, తొట్టెలలో నీరు పోసి ఉంచుతున్నారు.
పక్షి సందేశం...అందుకుందాం
తెల్లారక ముందే లేచి గూడు వదిలి వెళ్తుంటాం. ఎండలో ఎగురుతుంటే రెక్కలు అలిసి నీరసిస్తాం. మిగతా కాలాల్లో అంతగా ఇబ్బంది ఉండదు. కానీ ఎండాకాలం మాత్రం మాకు భారంగా గడుస్తుంది. ఆహారం దొరకక, నీరు లభించక అల్లాడిపోతాం. పోయిన ఏడాది మా పక్షిజాతిలో ఎన్నో రకాలు నీటి చుక్క దొరక్క దాహార్తితో రాలిపోయాయి. అందుకే మిమ్నల్ని ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నాం. మా కోసం కాసిన్ని నీళ్లిల్చిమా ప్రాణాలు కాపాడమని ప్రాధేమపడుతున్నాం. శ్రమ అనుకోకుండా మీ ఇంటి గోడ,డాబా,వీలైన ప్రదేశంలో గింజలు, మంచినీళ్లు ఏర్పాటు చేస్తే ఆకలి, దప్పిక తీర్చుకుంటాం. ఏదో సమయంలో మీ ముంగిటిల్లోకి వచ్చి మా బాషలో కృతజ్ఞతలు చెప్పుకుంటాం.
ఇట్లు .. మీ నేస్తాలు:
పావురాలు, పిచ్చుక, కాకి, కోయిల, చిలుక, ఇంకా మా తోటి పక్షిజాతులు (ఈ సందేశం వాటప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది)
దాహార్తి తీర్చుకుంటున్న కుక్కలు, కోతులు
పక్షుల దాహం తీర్చేలా
కారుణ్యం చూపిద్దాం


