నేటి నుంచి అన్నమాచార్య యూనివర్సిటీ వార్షికోత్సవాలు
రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీ విద్యాసంస్థల వార్షికోత్సవాలను పండుగలా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నమాచార్య యూనివర్సిటీ ప్రొ–చాన్స్లర్ చొప్పా అభిషేక్రెడ్డి తెలిపారు. మంగళవారం ఏయూ చాన్స్లర్ చొప్పా గంగిరెడ్డి చాంబరులో ఆయన మాట్లాడారు. ఈ నెల 7, 8, 9వ తేదీలలో అన్నమాచార్య యూనివర్సిటీ వార్షికోత్సవాలను నిర్వహించదలుచుకున్నామన్నారు. అన్నమాచార్య యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలకు సంబంధించి ఒకేసారి వార్షికోత్సవం చేపట్టడం ఇదే తొలిసారి అన్నారు. యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ, న్యాయ, బీఈడీ, పారామెడికల్ కోర్సుల కళాశాలలు ఉన్నాయన్నారు. వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ఏయూ యాజమాన్యం తన వంతుగా కృషి చేస్తోందన్నారు. ఏయూ చాన్స్లర్ చొప్పా గంగిరెడ్డి ఆధ్వర్యంలో అన్నమాచార్య యూనివర్సిటీ రాయలసీమకే తలమానికంగా ఉండేలా రూపుదిద్దుకుంటోందన్నారు. వార్షికోత్సవాల తొలిరోజున అంటే 8న ప్రముఖ సింగర్ మంగ్లి, సినీ నటుడు మౌలి తనుజ్ ప్రశాంత్ పాల్గొంటారన్నారు. సంగీత విభావరి కార్యక్రమం ఉంటుందన్నారు. రెండవ రోజున కోర్టు మూవీ హిరోయిన్ శ్రీదేవి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి పాల్గొంటారన్నారు. స్పోర్ట్స్, కల్చరల్ దినోత్సవాలు జరుగుతాయన్నారు. ముగింపు రోజున హ్యాపీడేస్ హీరో నిఖిల్ సిద్దార్థ, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుగిల్లి, అన్నమాచార్య యూనివర్సిటీ చాన్స్లర్ చొప్పా గంగిరెడ్డి పాల్గొంటారన్నారు. ఏయూ విద్యాసంస్థల వార్షికోత్సవాలు ఉంటాయన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో విభిన్న రీతిలో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. వేలాది మంది విద్యార్థిని, విద్యార్థులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారన్నారు. ఈ ఉత్సవాలకు ఏయూ యాజమాన్యం సర్వం సిద్ధం చేసిందన్నారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలు నిర్దేశించిన సమయానికి ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ఈయూ డాక్టర్ సాయిబాబరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


