జిల్లా కేంద్రం అన్ని ప్రాంతాల వారికి సౌకర్యంగా ఉండాలి
రాజంపేట టౌన్: జిల్లా కేంద్రం అన్ని ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి తెలిపారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్, అన్నమయ్య జేఏసీ నాయకులు మర్రి రవికుమార్ పట్టణంలోని ఆర్అండ్బీ బంగ్లా వద్ద రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా చేయాలని చేపడుతున్న రిలే నిరాహార దీక్షలో ఆదివారం ఎమ్మెల్యే పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం ఆకేపాటి మాట్లాడుతూ ఆరు నియోజకవర్గాలుగా అన్నమయ్యజిల్లా ఉంటే అన్ని ప్రాంతాల వారికి రాయచోటి మధ్యలో ఉంటుందని, అందువల్ల గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాయచోటిని జిల్లా కేంద్రం చేసిందన్నారు. అయితే చంద్రబాబుప్రభుత్వం మదనపల్లెను జిల్లా చేస్తుండటంతో మూడు నియోజకవర్గాలతోనే అన్నమయ్య జిల్లా ఉంటుందన్నారు. అందువల్ల రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాలకు రాజంపేట మధ్యలో ఉంటుందన్నారు. రాయచోటి జిల్లా కేంద్రం అయితే రైల్వేకోడూరులోని అన్ని మండలాల ప్రజలు రెండు బస్సులు మారి 80 నుంచి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుందనిఆవేదన వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలు తమ పనుల నిమిత్తం రాయచోటికి వెళ్లి రావాలంటే చార్జీలకే 250 రూపాయిలు ఖర్చవుతుందన్నారు. ఇక వైఎస్సార్జిల్లాలో ఉండే ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలకు రాయచోటి కేంద్రంగా అన్నమయ్యజిల్లా ఉంటే వారి పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉంటుందన్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల ప్రజలకు కడప కేవలం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. రాయచోటి జిల్లా కేంద్రం అయితే ఆ రెండు మండలాల ప్రజలు కూడా రెండు బస్సులు మారి 80 నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. ఆ మండలాల ప్రజలు కూడా తమ మండలాలను వైఎస్సార్ జిల్లాలోనే కొనసాగించాలని కోరుతున్నారని, అలా కాని పక్షణలో రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాచేసి అన్నమయ్యజిల్లాలో కలపాలని కోరుతున్నట్లు తెలిపారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి


