
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 149 ఫిర్యాదులు (పీజీఆర్ఎస్)కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజల నుంచిఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి విచ్చేసిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే జిల్లా ఎస్పీ వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
ఎస్పీ పేర్కొన్న ముఖ్య అంశాలు
● పోలీస్ శాఖ ద్వారా పరిష్కారం అయ్యే ప్రతి ఫిర్యాదును ప్రజలు స్వేచ్ఛగా తమ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం.
● ప్రజల నుంచి అందిన సదరు ఫిర్యాదులను నిర్ణీత సమయంలో చట్ట పరిధిలో పరిష్కరిస్తాం.
● ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు తమ వినతులను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన)కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్ పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్