
28న మోడల్ డీఎస్సీ పరీక్ష
కడప ఎడ్యుకేషన్: డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించే మోడల్ డీఎస్సీ పరీక్షను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ తెలిపారు. కడప డీఈఓ కార్యాలయంలో మోడల్ డీఎస్సీ పరీక్ష కరపత్రాన్ని డీవైఎఫ్ఐ నాయకులతో కలిసి ఆయన శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోరాటాలు, ఉద్యమాలు వంటివి మాత్రమే కాకుండా నిరుద్యోగులకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్ మాట్లాడుతూ ఈ పరీక్ష ఎస్జీటీ అభ్యర్థులకు మాత్రమేనని, ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఈ ప్రశ్న పత్రాన్ని ప్రముఖ విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు చేత తయారు చేయించినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ పరీక్షకు ఈ నమూనా పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కడపలో వెంకట సాయి కోచింగ్ సెంటర్, యూటీఎఫ్ భవన్, ప్రొద్దుటూరు సృజన్ కోచింగ్ సెంటర్, జమ్మలమడుగు ఎస్పీ డిగ్రీ కాలేజీ, బద్వేలు గౌతం కాలేజీ, పోరుమామిళ్ల వర్షా కోచింగ్ సెంటర్లు పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష కోసం రూ.50 ఎంట్రీ ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు కడప 99127 58515, 966664330, ప్రొద్దుటూరు 80080 87023, జమ్మలమడుగు 9912758515, 91009 95538, బద్వేలు 9059414222, 779950 626227, పోరుమామిళ్ల 824723631 అని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బ నరసింహులు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.