ఉద్యాన సాగుతో ఆర్థిక పరిపుష్టి | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన సాగుతో ఆర్థిక పరిపుష్టి

Apr 30 2025 2:00 AM | Updated on Apr 30 2025 2:00 AM

ఉద్యాన సాగుతో ఆర్థిక పరిపుష్టి

ఉద్యాన సాగుతో ఆర్థిక పరిపుష్టి

కడప అగ్రికల్చర్‌/చింతకొమ్మదిన్నె : ఉద్యాన పంటల సాగుకు సంబంధించి తక్కువ ఖర్చుతో అధిక లాభాలతో పాటు ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి పేర్కొన్నారు. ఏపీ జీఎస్‌డీపీలో జిల్లా వాటా శాతాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందని దీంతోపాటు వైఎస్సార్‌ జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. జిల్లా రైతులకు ఉద్యాన సాగులో ప్రోత్సాహం కల్పించే దిశగా మంగళవారం కడప నగర శివార్లలోని మాధవి కన్వెన్షనల్‌ హాల్‌లో జిల్లా ఉద్యాన శాఖ జిల్లా అధికారి సుభాషిణి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన శ్రీకడప ఉద్యాన సమ్మేళనం్ఙ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా జీవీఏలో 45 శాతం వాటా ఒక్క ఉద్యాన ఉత్పత్తుల ద్వారా వస్తోందన్నారు. జిల్లాలో ప్రధానంగా అరటి, చీనీ, పసుపు, ఉల్లిగడ్డ మొదలైన ప్రధాన పంటలను జిల్లా ఉద్యాన గ్రోత్‌ ఇంజన్స్‌గా గుర్తించామన్నారు. ఈ ప్రధాన పంటలను రాష్ట్ర, దేశ స్థాయితో పాటు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర హార్టికల్చర్‌– సెరికల్చర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యం ఇస్తూనే ఉద్యాన పంటలను సాగుచేసే రైతులు ప్రకృతి వ్యవసాయంలోకి మారాలన్నారు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపారమైన అవకాశాలు, సదుపాయాలు ఉన్నాయని, అందుకు సంబంధించిన ఉత్పత్తుల నిల్వకు అవసరమైన శీతల గిడ్డంగుల నిర్మాణం ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంలో ఉద్యా శాఖ పాత్ర ఎంతో కీలకం అని పేర్కొన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ ఉద్యాన రంగంలో కొన్ని సవాళ్లు ఉన్నాయన్నారు. పోస్ట్‌ హార్వెస్ట్‌లో ఆ నష్టాలు 10– 15 శాతం ఉన్నాయని, ఆ నష్టాలను ఎంత తగ్గించగలిగితే రైతులకు అంత ఆదాయం పెంచగలుగుతామన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ సమ్మేళనాన్ని నిర్వహించాలని కోరారు. తిరుపతి నిమ్మ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ మధుమతి, ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ సీఈఓ డాక్టర్‌ జి. శేఖర్‌బాబు, అనంతరాజుపేట డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన కళాశాల హెచ్‌ఓడీ – ప్రొఫెసర్లు డాక్టర్‌ శివప్రసాద్‌, డాక్టర్‌ రాజానాయక్‌ మాట్లాడారు. అనంతరం సహజ పద్ధతుల్లో పసుపు సాగు చేస్తున్న చెన్నూరుకు చెందిన ఆదర్శ రైతు కె. బాలచంద్ర, బహుళ పంటలు సాగు చేస్తున్న కామనూరుకు చెందిన ఆదర్శ రైతు ఎన్‌. రాఘవరెడ్డిలను ముఖ్య అతిథులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అయితా నాగేశ్వర రావు, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్‌ శారదమ్మ, డీఆర్డీఏ, మెప్మా పీడీలు ఆనంద్‌ నాయక్‌, కిరణ్‌ కుమార్‌, హార్టికల్చర్‌ టెక్నికల్‌ అధికారి జ్యోతిర్మయి, మార్కెటింగ్‌, ఉద్యాన, సంబంధిత అధికారులు, రైతులు, శాస్త్రవేత్తలు, ఉద్యాన కళాశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement