భువనగిరి : రాజాపేట మండలం నెమిలె గ్రామానికి మేక వెంకటేశ్వరరెడ్డి ఇప్పటివరకు 115 సార్లు రక్తదానం చేశారు. 1991లో వెంకటేశ్వరరెడ్డి 11 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు వ్యవసాయ బావి వద్ద జరిగిన ఓ ప్రమాదంలో ఆయన కాలుకు గాయమై ఇన్ఫెక్షన్ అయ్యింది. దీంతో ఆయన సర్జరీ కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. సర్జరీ కోసం రక్తం కావాల్సి ఉండగా.. ఎవరూ రక్తదానం చేసేందుకు ముందుకు రాలేదు. చివరికి వెంకటేశ్వరరెడ్డి బంధువులు ముందుకొచ్చి రక్తదానం చేయడంతో సర్జరీ చేశారు. ఆ సమయంలో రక్తదానం విలువ ఏంటో ఆయనకు తెలిసొచ్చింది. ఆ సమయంలోనే తన జీవితంలో వీలైనన్ని ఎక్కువ సార్లు రక్తదానం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయనకు 20 ఏళ్ల వయస్సు వచ్చాక వయస్సుకు అనుగుణంగా బరువును చూసుకుని 2004 నుంచి రక్తదానం చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 115 సార్లు రక్తదానం చేశారు. అంతేకాకుండా రాజాపేట బ్లడ్ డోనర్స్ అనే వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. అందులో ఇప్పటివరకు 200 మంది చేరారు. వెంకటేశ్వరరెడ్డి రక్తదాన శిబిరాలు సైతం నిర్వహించి 400 యూనిట్ల వరకు రక్తదానం చేసి అందజేశారు.


