
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మునగాల: మండలంలోని కృష్ణానగర్ గ్రామ శివారులో గల సాగర్ ఎడమకాలువ(పాలేరు)లో బుధవారం గల్లంతైన వ్యక్తి మృతదేహం గురువారం ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో లభ్యమైంది. నడిగూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణానగర్ గ్రామానికి చెందని భుక్యా బాబునాయక్(42) బుధవారం అయ్యప్ప మాల స్వీకరించాడు. అదే రోజు సాయంత్రం స్నానమాచరించేందుకు మిగతా మాలధారులతో కలిసి సాగర్ ఎడమకాలువ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో స్నానం చేస్తుండగా భుక్యా బాబునాయక్ ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. గురువారం పాలేరు జలాశయంలో అతడి మృతదేహం కనిపించింది. మృతుడి కుమారుడు భుక్యా భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నడిగూడెం పోలీసుల కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందని, ఆకుపచ్చ–నలుపు రంగు టీ షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పత్తి తీసేందుకు వెళ్లిన మహిళా కూలీ అదృశ్యం
నడిగూడెం : పత్తి తీసేందుకు వెళ్లిన మహిళా కూలీ ఈ నెల 7న అదృశ్యమైంది. స్థానిక ఎస్ఐ గందమళ్ల అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన పఠాన్ జానిబేగం (38) ఈనెల 7న తమ గ్రామానికి చెందిన తోటి కూలీలతో కలిసి ఆటోలో ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రాంతంలో పత్తి తీసేందుకు వెళ్లింది. తర్వాత జానిబేగం ఇంటికి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త పఠాన్ జాఫర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.