
అడ్డంకులు తొలగినా ఆలస్యమే..
ఫ 18 సంవత్సరాల క్రితమే శంకుస్థాపన
ఫ స్థలం సరిపోదంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన మార్కెటింగ్ అధికారులు
ఫ మరో చోట అనువైన భూమి గుర్తింపు.. నేటికీ కలగని మోక్షం
ఫ పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి అన్నదాతల అవస్థలు
సంస్థాన్ నారాయణపురం : వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం సంస్థాన్నారాయణపురం మండలంలో 33,150 ఎకరాల సాగు భూమి, సుమారు 15వేల మంది రైతులు ఉన్నారు. వీరంతా వరి, పత్తితో పాటు వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. వ్యయప్రయాసలకోడ్చి పండించిన పంటలను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులంతా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రంలో మార్కెట్ నిర్మాణానికి 18 ఏళ్ల క్రితమే శంకుస్థాపన జరిగినా నేటికీ పునాది పడలేదు.
మూడో దఫా 11 ఎకరాల స్థలం గుర్తింపు
సంస్థాన్నారాయణపురం మండల కేంద్రంలో సబ్ మార్కెట్ నిర్మాణానికి రూ.60లక్షలు మంజూరయ్యాయి. 2007 డిసెంబర్ 22న అప్పటి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డు నిర్మాణం కోసం 114 సర్వే నంబర్లో నాలుగున్నర ఎకరాలు గుర్తించారు. అది మూడు గ్రామ పంచాయతీల పరిధిలో ఉంది. దాని కోసం అప్పట్లో రూ.2.20 లక్షలు ప్రభుత్వానికి చెల్లించారు. గుర్తించిన స్థలంలో 1.10 ఎకరాలు గుట్ట ఉండడంతో మార్కెట్శాఖ సాంకేతిక అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన స్థలం చూపితేనే మార్కెట్ పనులు చేపట్టడానికి అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో సంస్థాన్నారాయణపురం పరిధిలో సర్వే నంబర్ 450లో 44 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశిలించారు. అది కూడా రాళ్లు, గుట్టలతో నిండి ఉంది. ఎత్తయిన ప్రదేశంలో ఉండటం, దాని పక్కన అదర్శ పాఠశాల ఉండటం, గుట్టలు, రాళ్లు తొలగించి చదును చేయడం ఖర్చుతో కూడుకుందని అధికారులు చెప్పడంతో భూ సమస్య మొదటికి వచ్చింది. ఆ తరువాత మూడేళ్ల క్రితం సర్వే నంబర్ 255లో 11 ఎకరాల స్థలం గుర్తించారు. అందులో 6 ఎకరాలు మార్కెట్ యార్డుకు, 5 ఎకరాలు పీఏసీఎస్ గోదాంలకు కేటాయించారు. స్థలం అనువుగా ఉండటం, అధికారులు కూడా అంగీకరించారు. అడ్డంకులు తొలగినా నేటికీ పనులు ప్రారంభించడం లేదు.
వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డు నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా వేసిన శిలాఫలకం
సబ్ మార్కెట్ యార్డు ఏర్పాటుకు
తాజాగా ప్రతిపాదించిన స్థలం
మార్కెట్ లేక నష్టపోతున్నాం
నారాయణపురంలో మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో వల్ల మండల రైతులందరం ఇబ్బంది పడుతున్నాం. ఇతర మార్కెట్లకు పోవాలంటే రవాణా చార్జీలు మీద పడి నష్టపోతున్నాం. స్థానికంగా మార్కెట్ ఏర్పాటు చేస్తే అదనపు భారం తప్పుతుంది. భూమి సిద్ధంగా ఉన్నందున వెంటనే పనులు ప్రారంభించాలి.
–రాచకొండ స్వామి, రైతు,
సంస్థాన్నారాయణపురం
20 కిలో మీటర్లు పోవాల్సిందే..
స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో పండించిన పంటలు అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న చండూరు, చౌటుప్పల్, మాల్, మునుగోడు, చిట్యాల, నల్లగొండ మార్కెట్లకు వెళాల్సి వస్తుంది. పంట ఉత్పత్తులు తరలించడానికి వారికి అదనంగా రవాణా చార్జీలతో పాటు సమయం వృథా అవుతుంది. అంతదూరం వెళ్లినా మద్దతు ధర దక్కకపోవడంతో చాలా మంది రైతులు దళారులకు విక్రయిస్తున్నారు.