పెనుగొండ: వైఎస్సార్సీపీ స్థాపన నుంచి కార్యకర్తలే పార్టీకి బలమని, కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. బుధవారం తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆచంట, పోడూరు మండలాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి గ్రామస్థాయి అనుబంధ కమిటీల సభ్యులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కేడర్ ఎక్కడా చెక్కు చెదరలేదన్నారు. పార్టీ రోజురోజుకూ మరింత పటిష్టం అవుతుందన్నారు. ఎన్నికల్లో పొరపాటు చేశామని ప్రజలు భావిస్తున్నారని, వారి మనసుల్లో మార్పు మొదలైందన్నారు. ప్రతి సర్వేలోనూ వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రజలు నిలుస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని, వీటిపై అడిగితే సాకులు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అవినీతి, అక్రమాలతో నిండిపోయిందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులే కాకుండా అన్నివర్గాలను మోసగించిందన్నారు. ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగమంటున్నారన్నారు. అక్రమాలు, అవినీతిని సాక్ష్యాలతో సహా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపిస్తే, పొంతన లేకుండా రోజుకో సమాధానం చెబూతూ అభాసుపాలవుతున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అత్యధిక స్థానాలు గెలవబోతుందని అన్నారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగితే విజయం ఖాయమన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి కూటమి మోసాలను, వైఎస్సార్సీపీ పాలనలో అందిన సంక్షేమాన్ని వివరించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు గూడూరి ఉమాబాల, ఆచంట నియోజకవర్గ పరిశీలకురాలు మేడపాటి షర్మిళా రెడ్డి, పోడూరు ఎంపీపీ సబ్బితి సుమంగళి, మండల కన్వీనర్లు జక్కంశెట్టి శ్రీరామ్, పిల్లి నాగన్న, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గుబ్బల వీరబ్రహ్మం, పోతుమూడి రామచంద్రరావు, మామిడిశెట్టి కృష్ణవేణి పాల్గొన్నారు.
మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు


