● విచ్చలవిడిగా పాలిథిన్ కవర్ల వాడకం
● పంట కాలువలు, డ్రెయిన్లలోకి వ్యర్థాలు
● చర్యలు తీసుకోకుంటే పర్యావరణానికి ముప్పు
భీమవరం : ప్లాస్టిక్రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామంటూ అధికారులు చెబుతున్న మాటలు ఆచరణలో నీటిమూటలవుతున్నాయి. భూమి, నీరు కలుషితమై ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతున్నా ప్రజలు ప్లాస్టిక్ కవర్ల వాడకం మానడం లేదు. ‘గుడ్డ సంచులే ముద్దు’ అని స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పి స్తున్నా, వినియోగదారుల్లో మార్పు రావడం లేదు. దుకాణదారులు విచ్చలవిడిగా ప్లాస్టిక్ సంచులు ఇస్తున్నా, అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. గతంలో ప్రజలు బజారుకు వెళ్తే చేతితో గుడ్డ సంచి తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు కిరాణా, కూరగాయలు, హోటళ్లలో ఆహారం వరకు ప్రతీదీ ప్లాస్టిక్ కవర్లలోనే ప్యాక్ చేసి ఇస్తుండటంతో, చేతిసంచి తీసుకెళ్లడం నామోషిగా భావిస్తున్నారు.
పేరుకుపోతున్న చెత్త
భీమవరం పట్టణాన్ని ప్లాస్టిక్రహితంగా మార్చాలని కలెక్టర్ గట్టి సంకల్పంతో మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ముందస్తుగా కలెక్టరేట్లో ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం గాజు, స్టీల్ పాత్రల వినియోగాన్ని అమలుచేశారు. అయితే, మున్సిపల్ అధికారులు పట్టణంలో మొక్కబడిగా తనిఖీలు చేసి, కొద్దిపాటి జరిమానాలతో వదిలేస్తుండటంతో నిషే ధం ఏమాత్రం ఫలించడం లేదు. పంట కాలువలు, డ్రెయిన్లలో పేరుకుపోతున్న చెత్తే దీనికి నిదర్శనం. నిషేధాన్ని పాటించే కొద్దిమంది వ్యాపారులు, ప్లాస్టిక్ వాడే ఇతర వ్యాపారుల వల్ల బోణీలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా కేంద్రమైన భీమవరంలోనే ప్లాస్టిక్ నిషేధం సరిగ్గా అమలు కాకపోతే, ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎలా సాధ్యమవుతుందని ప్రజ లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ప్లాస్టిక్ వాడకంపై కఠిన చర్యలు తీసుకోకపోతే పర్యావరణానికి తీవ్ర ముప్పు తప్పదు.


