తణుకులో దుర్ఘటన
తణుకు అర్బన్: రోడ్డు ప్రమాదంలో తల్లి, కూతురు మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి తణుకు శివారులో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన గంధం వంశీకృష్ణ తన భార్య లావణ్య (22), కుమార్తె కీర్తన (2)లను తీసుకుని ద్విచక్ర వాహనంపై తణుకు మీదుగా కొమరవరం రోడ్డులో వెళ్తుండగా స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాల వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఎక్కిన తరువాత అదుపుతప్పి పడిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో లావణ్య ముఖభాగం పూర్తిగా ఛిద్రమైపోగా, చి న్నారి కీర్తనకు తీవ్రగాయాలయ్యాయి. ఘటన సమయంలో స్పీడ్ బ్రేకర్స్పై నుంచి వాహనం ఎక్కగానే వాహనం మీద నుంచి ఎగిరి సమీపంలో ఉన్న స్తంభానికి ఢీకొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది హుటాహుటిన క్షతగ్రాత్రులను తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి వచ్చేసరికే కుమార్తె ప్రాణాలతో లేదని, తల్లి మాత్రం కొన ఊపిరితో కొట్టుకుని చనిపోయినట్టు వైద్యులు చెబుతున్నారు. వంశీకృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో తణుకులో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఉండ్రాజవరం నుంచి లావణ్య తల్లి ఊరు గణపవరం మండలం భువనపల్లికి వెళ్తున్నట్టు బంధువులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపిస్తున్నారు. చిన్నారి మరణం బంధువులతోపాటు స్థానికులను కలచివేసింది.
చిన్నారి కీర్తన, తల్లి లావణ్య మృతదేహాలు


