ద్వారకాతిరుమల: శ్రీవారి భక్తులకు ఆన్లైన్ సేవలను మరింత చేరువ చేసేందుకు కియోస్క్ మెషీన్లను ఏర్పాటు చేసినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. స్థానిక అనివేటి మండపంలో ఏర్పాటు చేసిన ఈ కియోస్క్ మెషీన్లను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కరూర్ వైశ్యా బ్యాంక్ల సంయుక్త సహకారంతో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో 100 కియోస్క్ మెషీన్లను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తలపెట్టినట్టు చెప్పారు. అందులో భాగంగానే శ్రీవారి ఆలయంలో ఈ కియోస్క్ల సదుపాయం భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉపయోగాలిలా..
● భక్తుల చేతిలో నగదు లేకపోయినా డిజిటల్ యూపీఐ, కార్డుల ద్వారా (నగదు రహిత) చెల్లింపులు జరిపి దర్శనం, ప్రసాదం, వివిధ సేవా టికెట్లను సులభంగా పొందవచ్చు.
● ఈ మెషీన్ల ద్వారా నేరుగా టికెట్లు తీసుకుంటే క్యూలైన్లలో వేచి ఉండక్కర్లేదు. దాంతో సమయం ఆదా అవుతుంది.
● టికెట్లు విక్రయించే ప్రక్రియలో భక్తులకు మరింత పారదర్శకత లభిస్తుంది.
కియోస్క్లు ఏర్పాటు చేసిన ప్రదేశాలు ఇవీ..
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ కియోస్క్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అనివేటి మండపం, కొండ కింద సమాచార కేంద్రం, కేశఖండనశాల, శ్రీ ధర్మ అప్పరాయ నిలయం, ప్రసాదాల కౌంటర్ల సముదాయం, పీఆర్వో కార్యాలయం, నిత్య కల్యాణ మండపం వద్ద వీటిని ఏర్పాటు చేసినట్టు ఈఓ పేర్కొన్నారు. కియోస్క్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు, ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ, కరూర్ వైశ్యా బ్యాంక్ డీజీఎం ఎన్.రమేష్, అరవింద్ గణేష్, సీబీ శేఖర్, ఏలూరు బ్రాంచ్ హెడ్ కె.ఫణికుమార్ తదితరులున్నారు.
శ్రీవారి దేవస్థానంలో కియోస్క్ మెషీన్లు ప్రారంభం


