గట్లకు తూట్లు | - | Sakshi
Sakshi News home page

గట్లకు తూట్లు

Apr 26 2025 12:53 AM | Updated on Apr 26 2025 1:23 AM

గట్లక

గట్లకు తూట్లు

డ్రెయిన్‌ గట్లకు తూట్లు పొడుస్తూ జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. గోదావరి గట్టును పటిష్టం చేసే పేరిట కొందరు, అనధికారికంగా మరికొందరు మేజర్‌ డ్రెయిన్ల గట్లను కొల్లగొట్టి మట్టిని తరలించుకుపోతున్నారు. పలుచోట్ల గట్లు కృంగిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం: యలమంచిలి మండలం కంచుస్తంభంపాలెం పంచాయతీ వాకలగరువు, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడుపాలెం, లక్ష్మీపాలెం గ్రామాల పరిధిలో దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర సుమారు రూ.6.71 కోట్ల వ్యయంతో వశిష్ట గోదావరి ఏటిగట్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నాలుగు నుంచి ఐదు మీటర్లు మేర గట్టును ఎత్తు చేస్తున్నారు. ఆచంట మండలంలోని ఆచంట వేమవరంలోని నక్కల డ్రెయిన్‌ గట్టుపై కన్నేసిన కూటమి నేతలు ఇక్కడి నుంచి ఏటిగట్టు పనులకు మట్టి తరలించే పేరిట తవ్వకాలు చేపట్టారు. డ్రెయిన్‌ గట్టును ఆనుకుని డ్రైనేజీ శాఖకు చెందిన సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో నాలుగు అడుగుల నుంచి ఎనిమిది అడుగుల లోతు వరకు తవ్వకాలు చేసేశారు. ఏటిగట్టు పనుల ముసుగులో మట్టిని పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. పాలకొల్లు, పరిసరాల్లో కొత్తగా వెలుస్తున్న లే అవుట్లు, మెరక పనుల కోసం మట్టిని తరలించేసినట్టు తెలుస్తోంది. నెలరోజుల్లో దాదాపు రూ.కోటికి పైగా విలువైన మట్టిని తరలించుకుపోయినట్టు అంచనా. పరిమితులు పాటించకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు చేయడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయిందని స్థానికులు తెలిపారు. రోజుకు వందకు పైగా లారీల్లో, నెలరోజులకు పైగా తవ్వకాలు చేసినట్టు తెలిపారు. భారీ లోడుతో లారీలు తిరగడం వలన ఎక్కడికక్కడ గట్టు కృంగి పోయింది. తవ్వకాలు చేసిన చోట ట్రాక్టర్‌ వెళ్లే దారి లేకుండా గట్టు కాలువలోకి జారిపోయి ప్రమాదభరితంగా తయారైంది. ఇప్పటికే ఆచంట వేమవరం పరిధిలోని ఒక చోట డ్రెయిన్‌ గట్టు బలహీన పడటంతో ఇక్కడి నుంచి మట్టి తీసుకువెళ్లి గట్టు పటిష్టం చేయాలని భావించామని, ఇంతలో మొత్తం మట్టిని మొత్తం ఊడ్చుకుని ఎత్తుకెళ్లిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వయ్యేరులో అక్రమ తవ్వకాలు

తణుకు నియోజకవర్గంలో ప్రధానమైన వయ్యేరు అక్రమ తవ్వకాలతో గట్లు బలహీన పడుతున్నాయి. గత ఏడాది భారీ వర్షాలతో ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెం ప్రాంతంలో గండిపడి రెండు వేల ఎకరాల్లోని వరి పంట నీటమునిగింది. వయ్యేరు ప్రవాహ ఉధృతికి తణుకు మండలంలోని దువ్వ, తేతలి తదితర గ్రామాల్లో వరి పంట మునిగిపోయింది. దువ్వ రెగ్యులేటరీ వద్ద నివాసాలు నీట మునిగాయి. డ్రెయిన్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రెయినేజీ శాఖకు చెందిన అధికారిపై అప్పట్లో ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు సైతం తీసుకున్నారు. అయినా సంబంధిత అధికారులు పాఠాలు నేర్వకపోవడం గమనార్హం. దువ్వ సమీపంలో వయ్యేరు డ్రెయిన్‌లో రాత్రి వేళల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. పొక్లెయిన్లతో గట్టును తొలిచి ట్రాక్టర్లలో మట్టిని తరలించుకుపోతున్నారు. ట్రాక్టర్లు డ్రెయిన్‌లోకి దిగేందుకు వీలుగా ఇసుక ర్యాంపుల్లో మాదిరి బాటను కూడా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ట్రాక్టర్‌ మట్టి రూ.1,000 నుంచి రూ.1,500 వరకు అమ్మకాలు చేస్తున్నారు. అక్రమ తవ్వకాలతో గట్లు బలహీన పడుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలు, వరదల సమయంలో గండి పడి ముంపునకు గురయ్యే ప్రమాదముందని వారంటున్నారు. అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని, గట్లను పటిష్టం చేయాలని కోరుతున్నారు. ఆచంట వేమవరంలో నక్కల డ్రెయిన్‌ గట్టు తవ్వకాలు గూర్చి ఆచంట తహసీల్దార్‌ కనకరాజును సంప్రదించగా తమ పరిధిలోకి రాదని తెలిపారు. నక్కల డ్రెయిన్‌, వయ్యేరు డ్రెయిన్‌లో తవ్వకాలుపై డ్రెయినేజీ ఈఈ సత్యనారాయణను ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేయగా కలవలేదు.

న్యూస్‌రీల్‌

నక్కల డ్రెయిన్‌లో పరిమితికి మించి తవ్వకాలు

రూ.కోటికి పైగా విలువైన మట్టిని తరలించేసిన కూటమి నేతలు

ఆచంట వేమవరం వద్ద జారిపోయిన గట్టు

దువ్వలో వయ్యేరు డ్రెయిన్‌ గట్టు గుల్ల

చోద్యం చూస్తున్న అధికారులు

గట్లకు తూట్లు 1
1/3

గట్లకు తూట్లు

గట్లకు తూట్లు 2
2/3

గట్లకు తూట్లు

గట్లకు తూట్లు 3
3/3

గట్లకు తూట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement