కాజీపేట రూరల్ :
కాజీపేట–పెద్దంపేట రైల్వేస్టేషన్ల వరకు 101 కిలోమీటర్ల మేర గ్రాండ్ ట్రంక్ రూట్లో కవచ్ (రైలు ప్రమాద నివారణ వ్యవస్థ)ను పూర్తిచేసి గురువారం ట్రయల్ రన్ చేయనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పీసీఎస్టీఈపీవీ మురళీకృష్ణ, సీఎస్టీఈ ఎం.కోటేశ్వర్రావు నేతృత్వంలో సికింద్రాబాద్ డిప్యూటీ సీఎస్టీఈ జి.కుమారన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ యూనిట్ పనిని పూర్తి చేశారు. స్వదేశీ భద్రత సాంకేతికతను బలోపేతం చేయడంలో ముఖ్యమైన అడుగుగా అధికారులు పేర్కొంటున్నారు. దక్షిణమధ్య రైల్వేలో గ్రాండ్ ట్రంక్ రూట్ అయిన బల్లార్షా–విజయవాడ సెక్షన్ అత్యంత రైళ్ల ట్రాఫిక్ కలిగింది. ఈ సెక్షన్లో ఎస్ఐఎల్ –0 కవచ్ వ్యవస్థ ప్రమాదాలను నివారిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కాజీపేట నుంచి పెద్దంపేట వరకు కవచ్పై రెండు రైలు ఇంజన్లతో ట్రయల్ రన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ట్రయల్రన్ నిర్వహణకు పలువురు అధికారులు గురువారం ప్రత్యేక రైలులో సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు రానున్నారు.
కవచ్ ఫీచర్లు ఇవే..
రైళ్లు ఢీకొనకుండా నివారణ, బ్లాక్ సెక్షన్లో రైళ్లు ముఖాముఖి లేదా వెనుక నుంచి ఢీకొనకుండా నిరోధించే అత్యాధునిక సాంకేతికత.
బ్లాక్స్టాప్ సందేశాలు : ఎదురుగా వచ్చే రైళ్లను అప్రమత్తం చేయడానికి సెక్షన్ పరిధిలో తక్షణమే బ్లాక్ స్టాప్ సందేశాలను పంపుతుంది.
రోల్బ్యాక్ ప్రొటెక్షన్ : లోకోమోటివ్ అనుకోకుండా వెనక్కి కదలడాన్ని గుర్తించి, అనుకోకుండా వెనక్కి కదలడాన్ని గుర్తించి ఆటోమేటిక్గా నిరోధిస్తుంది.
మాన్యువల్ ఎస్ఓఎస్: అత్యవసర సమయంలో లోకోపైలెట్లు మాన్యువల్ ఎస్ఓఎస్ సిగ్నల్ను పంపే కీలక సదుపాయం ఉంది.
వ్యూహాత్మక ప్రాధాన్యం: విజయవాడ–బల్లార్షా మార్గం ప్రాంతీయ రైల్వే మౌలిక సదుపాయాలకు వెన్నెముక వంటిది. ఈ హైస్పీడ్ కారిడార్ కవచ్ను అనుసంధానించడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే మానవ తప్పిదాల ప్రమాదాన్ని తగ్గించి సిగ్నలింగ్ నెట్వర్క్ విశ్వసనీయతను పెంపొందించనుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు.


