నర్సంపేట: ఆదాయంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ప్రథమ స్థానాన్ని సాధించింది. జిల్లాలోని ఏనుమాముల, నర్సంపేట, వర్ధన్నపేట, నెక్కొండ వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. మిగిలిన మూడు మార్కెట్ల కంటే ఆదాయపరంగా లక్ష్యాన్ని దాటి ముందు వరుసలో నిలిచింది. రూ.5.68 కోట్లకు రూ.6.75 కోట్ల ఆదాయాన్ని ఈ సంవత్సరం సమకూర్చుకుంది. గత సంవత్సరం నాలుగు వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా మార్కెటింగ్ శాఖకు 46.91 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం రూ.61.45 కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే, మూడు వ్యవసాయ మార్కెట్లు తక్కువ ఆదాయాన్ని సమకూర్చుకోగా నర్సంపేట మాత్రం ముందంజలో నిలిచింది.
చైర్మన్, అధికారులు, సిబ్బంది సహకారంతో..
జిల్లాలోని ఏనుమాముల, వర్ధన్నపేట, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ల కంటే నర్సంపేట వ్యవసాయ మార్కెట్ అధిక ఆదాయం సమకూర్చుకోవడంలో అందరి కృషి ఉంది. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది అంకితభావంతో పని చేయడంతో లక్ష్యం కంటే ఎక్కువ ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ అనుకున్న లక్ష్యాన్ని చేరకపోవడం, ఈ సంవత్సరం లక్ష్యాన్ని అధిగమించి రూ.కోటి 7లక్షల వరకు అధిక ఆదాయాన్ని సమకూర్చుకోవడం గమనార్హం. నెక్కొండ రూ.6లక్షలు వెనుకబడి ఉండి కొంత ఫరవాలేదు అనిపించుకుంది. ఏనుమాముల, వర్ధన్నపేట మార్కెట్లు మాత్రం వెనుకబడి పోయాయి. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో పత్తి, ధాన్యం, మక్కలు ప్రధానంగా కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో పాటు ఫీజు వసూళ్లలో ప్రత్యేక పర్యవేక్షణ ఉండడంతో ఆదాయం పెరిగింది.
అందరి కృషితోనే ఆదాయం..
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఆదాయం లక్ష్యం కంటే అధిగమి ంచడంలో అందరి కృషి ఉంది. రైతులకు మెరుగైన వసతులు కల్పిస్తూనే ఆదాయం సమకూర్చడంలో సఫలీకృతం అయ్యాం. రానున్న రోజుల్లో వ్యవసాయ మార్కెట్ను మరింత అభివృద్ధి చేసేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుతాం. – పాలాయి శ్రీనివాస్,
మార్కెట్ చైర్మన్


