● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ఖానాపురం: ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. రామలింగయ్యపల్లి లోని రైతువేదికలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో అమలవుతున్న పథకాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గ పరిధిలో 2.9 లక్షల మంది మహిళలు ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణం చేశారని వివరించారు. త్వరలోనే నూతన పథకాల అమలుతో పాటు పింఛన్ల ప్రక్రియ సైతం ప్రారంభం కానుందని తెలిపారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టిన వారికి సైతం ఇళ్లు మంజూరు చేసి బిల్లులు ఇస్తామన్నారు. రైతులకు కూరగాయల విత్తనాలను, 98 మంది మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. కాగా, సమావేశంలో ఓ వ్యక్తి బీఆర్ఎస్ ముద్రించిన కాంగ్రెస్ హామీల బాకీ కార్డు ఎమ్మెల్యే మాధవరెడ్డికి అందజేశారు. ఇందులో కొన్ని అమలు కాలేదని, వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఆర్డీఓ ఉమారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, మైనార్టీ ఈడీ రమేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ హరిబాబు, ఆత్మ చైర్మన్ భిక్షంరెడ్డి, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీఓ సునీల్కుమార్, సర్పంచ్ రాణి, ఏఓ శ్రీనివాస్, గ్రామ పార్టీ అధ్యక్షుడు లింగిడి వెంకటేశ్వర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.


