ఖిలా వరంగల్: అఖండ భారతావని కోసం హిందువులంతా సంఘటితమై హిందూ, సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలని, హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని శ్రీచైతన్య శక్తిపీఠాఽధీశులు సిద్ధయోగి స్వామి శ్రీచైతన్య ఆనంద మహరాజ్ పిలుపునిచ్చారు. వరంగల్ రంగశాయిపేట మహంకాళి ఆలయ ప్రాంగణం వద్ద గురువారం సాయంత్రం ముఖ్య అతిథిగా హాజరైన శ్రీచైతన్య శక్తి పీఠాధిపతి శ్రీ చైతన్య ఆనంద మహరాజ్ కాషాయ జెండా ఊపి హనుమాన్ శోభాయాత్ర, బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈయాత్ర ఉర్సు కరీమాబాద్, వై ఆకారం ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా బట్టల బజార్, ఎంజీఎం జంక్షన్, ములుగు రోడ్డు, హనుమకొండ జంక్షన్ మీదుగా పద్మాక్షి దేవాలయ ప్రాంగణం వరకు సాగింది. భక్తులు, వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని ర్యాలీగా బయల్దేరారు. సీపీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వరంగల్ సబ్ డివిజన్ ఏఎస్పీ శుభం చైతన్య ఆధ్వర్యంలో శోభాయాత్రలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వరంగల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు గంట రవికుమార్, రావు పద్మ, ఎర్రబెల్లి ప్రదీప్రావు, కొండేటి శ్రీధర్, చాడ స్వాతి, డాక్టర్ వన్నాల వెంకటరమణ, మల్లాడి తిరుపతిరెడ్డి, జలగం రంజిత్, బండి సాంబయ్య, కుసుమ సతీశ్, బన్న ప్రభాకర్, శ్యామ్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు జైపాల్రెడ్డి, కార్యదర్శి చందర్బాబు, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీచైతన్య శక్తి పీఠాధీశులు స్వామి చైతన్య ఆనంద మహరాజ్
నగరంలో భక్తిశ్రద్ధలతో
హనుమాన్ శోభాయాత్ర


