నర్సంపేట: బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళలకు రక్షణ లేదని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతమ్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీకి చెందిన 44 మంది ఎంపీలు, ఎమ్మెల్యే అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో ఉన్నారని ఆరోపించారు. మహిళలు అంటే గౌరవం లేని పార్టీ బీజేపీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక వైపు మహిళలకు గౌరవం ఇవ్వాలని మాట్లాడుతుంటే దేశంలో మహిళలకు రక్షణ కరువవుతుందన్నారు. దేశంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు, ఆడబిడ్డలపై దాడులు జరుగుతుంటే చూస్తూ నోరు విప్పని బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ ఆర్గనైజర్ సెక్రటరీ కోతి మమత, నర్సంపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు ధోని కీర్తన, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు వెండి సక్కుబాయి, వివిధ మండలాల మహిళా అధ్యక్షురాలు బండి పద్మ, బుర్రి సునీత, బిక్కిరెడ్డి సంధ్య, సురం సాంబలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


