● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలో ప్రణాళిక ప్రకారం నిధులు కేటాయించుకుంటూ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని పాలకవర్గానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. ఈమేరకు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో వార్షిక బడ్జెట్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 2026 – 27వ సంవత్సరానికి సంబంధించిన ఆదాయం రూ.74 కోట్ల 4లక్షల 51వేల ఆదాయాన్ని అంచనా వేయగా, రూ.74 కోట్ల 2లక్షల 51వేలతో అంచనా వ్యయాన్ని రూపొందించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి సరఫరాకు అంతరాయం కలుగకుండా చూసుకోవాలన్నారు. విలీన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పట్టణంలో వంద శాతం పన్నుల వసూలు చేయాలని, వీధి దీపాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కౌన్సిలర్ సభ్యులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి పాటు పడాలని పేర్కొన్నారు. అంచనా బడ్జెట్లో పదిశాతం నిధులను హరితహారం, నీటి సరఫరాకు కేటాయించుకోవాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్ గణేష్, చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి, వైస్ చైర్మన్ గంధం నరేందర్, మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కృషి
ఒకవైపు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూనే మరోవైపు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)ను ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతం చేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మహిళా సాధికారత సంబరాల కార్యక్రమాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి ఆధ్వర్యంలో డిపోలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం మహిళా సాధికారతకు నిదర్శనమని అన్నారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సర్కారు సమకూరుస్తోందని, డిపోల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తోందని, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రవి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్, కౌన్సిలర్లు, ఆర్టీసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


