వరంగల్ చౌరస్తా: మహాలక్ష్మి పథకం రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలవుతున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా మార్చి 29 నాటికి మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 290 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేసి, సుమారు రూ.10 వేల కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా ఆర్టీసీ వరంగల్ ఆధ్వర్యంలో వరంగల్ బస్స్టేషన్ ఆవరణలో మంగళవారం విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.
రూ.200 కోట్ల వ్యయంతో ఎలక్ట్రికల్ బస్సులు
గీసుగొండ, సంగెం మండలాలకు ఒక్కో ఎలక్ట్రిక్ బస్సును కేటాయించి మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. అదనంగా రూ.200 కోట్ల వ్యయంతో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఛార్జింగ్ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అనంతరం, అత్యధికంగా ఉచిత బస్సు ప్రయాణాలు చేసిన మహిళలను కలెక్టర్, మేయర్ సన్మానించి బహుమతులు అందజేశారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ చింతాకుల అనిల్కుమార్, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ రాంరెడ్డి, డిపో మేనేజర్ ధరంసింగ్, అసిస్టెంట్ మేనేజర్ నజియా సుల్తానా పాల్గొన్నారు.
నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద
వరంగల్ బస్స్టేషన్ ఆవరణలో విజయోత్సవ కార్యక్రమం


