వరంగల్ మార్కెట్కు 70 వేల బస్తాల మిర్చి
వరంగల్: మిర్చి సీజన్ ఊపందుకోవడంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్కు మిర్చి భారీ మొత్తంలో తరలి వస్తోంది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమవారం సుమారు 70వేల వరకు మిర్చి బస్తాలు వచ్చాయి. దీంతో ఏ యార్డులో చూసినా ఎర్రబంగారమే దర్శనమిచ్చింది. గురువారం ఉగాది కావడంతో రైతులు ముందుగానే కోసి మార్కెట్కు తరలించారు. పండుగతోపాటు మూడు రోజులు మార్కెట్కు సెలవు ప్రకటించడంతో రైతులు పెద్ద మొత్తంలో మిర్చి తీసుకొచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పంటకు అధిక ధరలు పలుకుతుండడంతో రైతులు ఎప్పటికప్పుడు కోసిన మిర్చిని తరలిస్తున్నారు. సింగిల్ పట్టీ మిర్చికి 13వ తేదీన రూ.44వేలు ధర పలకగా సోమవారం అదే రకం మిర్చికి రూ.42వేలు పలికింది. యూఎస్ 341 రకం మిర్చికి రూ.22,400 పలకగా రూ.21,600 పలికింది. సరుకు ఎక్కువగా వచ్చినప్పుడు ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
పక్క జిల్లాల నుంచి వస్తున్న మిర్చి..
వరంగల్ వ్యవసాయ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దదిగా పేరొందడంతో పక్క జిల్లాలో పండిన మిర్చి కూడా తరలి వస్తోంది. పక్క జిల్లాల్లోని మార్కెట్లు చిన్నవి కావడంతో ఎక్కువ మిర్చి వస్తే సెలవు ప్రకటిస్తారు. మిర్చి మొత్తం కాంటాలైన తర్వాతే మళ్లీ కొనుగోళ్లు చేపడతారు. వరంగల్లో మిర్చిని నిల్వ చేసే కోల్డ్ స్టోరేజీల సామర్థ్యం ఉండడంతో కొనుగోళ్ల ప్రక్రియ నిలిచిపోకుండా సాగుతాయి. అందుకే రైతులు వరంగల్ మార్కెట్కు వస్తారని మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు తెలిపారు.


