హన్మకొండ: హనుమకొండ గోకుల్నగర్లో అంబేడ్కర్ భవన్ పక్కన నిర్మించిన ‘కుడా’ అపార్ట్మెంట్స్ ప్రమాదకరంగా మారాయని అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రెంటాల కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్ తెలిపారు. ‘కుడా’ అపార్ట్మెంట్ నివాసితులు సమస్యలను జిల్లా కమిటీ దృష్టికి తీసుకెళ్లగా ఆదివారం అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు రెంటాల కేశవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ రాగంశెట్టి సత్యనారాయణ అపార్ట్మెంట్ను పరిశీలించారు. అనంతరం అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ కమిటీతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ‘కుడా’ అపార్ట్మెంట్లో అనేక సమస్యలున్నాయని వివరించారు. లిఫ్ట్ల అడుగు భాగంలో సీపేజ్ కారణంగా నీరు రావడం చాలా ప్రమాదకరమన్నారు. ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అపార్ట్మెంట్లో 75 కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరంతా భయాందోళనల మధ్య గడుపుతున్నారన్నారు. ఈ అపార్ట్మెంట్లో ‘కుడా’ గెస్ట్ హౌజ్ కోసం మూడు ఫ్లాట్లు వాడుతున్నప్పటికీ... నెలవారీ మెయింటెనెన్స్ చెల్లించడం లేదని, ఇది అన్యాయమన్నారు. ‘కుడా’ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.


