● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట్: రబీ సీజన్ ధాన్యం సేకరణకు సి ద్ధం కావాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధి కారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రబీ 2025–26 ధాన్యం సేకరణ, 2024–25 సీఎంఆర్ డెలివరీ ప్రజా పంపణీ వ్యవస్థ అమలు, రైస్ మిల్లర్ల అసోషియేషన్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ పత్రాల సమర్పణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. జిల్లాలో 2025–26 రబీ సీజన్లో సమారు 2.10 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రైతులకు ఇబ్బందులు కలుగకుండా సుమారు 240 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ద్వారా అవసరమైన మాయిశ్చర్ మీటర్లు, వేయింగ్ మిషన్లు ప్యాడీ క్లీనర్లు డ్రయర్లు తదితర సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. ప్రజాపంపిణీ ద్వారా సరఫరా అవుతున్న బియ్యం ఎలాంటి దుర్వినియోగం జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, మార్కెటింగ్ అధికారి సురేఖ, రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


