గీసుకొండ: మండలంలోని కొమ్మాల జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కుకున్నారు. కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి గోవిందా.. అంటూ భక్తి పారవశ్యంతో నినాదాలు చేస్తూ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అధికంగా తరలిరావడంతో జాతర ప్రాంతం కిక్కిరిసింది. అర్చకులు రామాచారి, విష్ణు, ఫణి, ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్రెడ్డి, కొమ్మాల సర్పంచ్ కన్నెబోయిన యమునప్రవీన్, పంచాయతీ కార్యదర్శి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. స్వామివారిని నర్సంపేట చైర్పర్సన్ పెండం లక్ష్మీరామానంద్, కౌన్సిలర్లు కొంపల్లి వీణ, పొన్నాల మనీషా, ఇస్లావత్ రమ తదితరులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు.


