డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య
కమలాపూర్: వైద్యసేవలను ప్రజలు వినియోగించుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం వరంగల్ ఎంజీఎం వైద్యులు ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటి వరకు 1,597 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 132 మందిని తదుపరి వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం, జీఎంహెచ్లకు పంపినట్లు తెలిపారు. సర్పంచ్ రమనాగరాజు మాట్లాడుతూ ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక ఒక మంచి కార్యక్రమం అని, ప్రజలు వ్యాధులబారిన పడకుండా ఉండాలని, ఒకవేళ ఎవరైనా వ్యాధులతో బాధపడుతుంటే ప్రభుత్వం వైద్యం చేయిస్తుందన్నారు. శిబిరంలో ఉపసర్పంచ్ సిద్ధార్థ, ఎంజీఎం, పీహెచ్సీ వైద్యులు రేణుక, సంయుక్త, సర్వేశం, హెల్త్ సూపర్వైజర్లు కనకలక్ష్మి, ప్రభాకర్, ఫార్మసిస్ట్ సుచరిత, స్టాఫ్నర్స్ సరిత, ల్యాబ్ టెక్నీషియన్ సురేశ్, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


