ఖానాపురం: పరీక్ష కేంద్రంలోకి వెళ్తున్న విద్యార్థులు
● తొలిరోజు 13 మంది విద్యార్థులు గైర్హాజరు
● పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సత్యశారద
కాళోజీ సెంటర్: పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 47 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం రెగ్యులర్ విద్యార్థులు 9,492 మంది కాగా 13 మంది గైర్హాజరు అయినట్లు డీఈఓ బి.రంగయ్యనాయుడు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో తాత్కాలికంగా సీసీ కెమెరాలు అమర్చి పర్యవేక్షించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కాగా నగరంలోని కరీమాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్ను ఆర్డీఓ సుమ, ఖిలావరంగల్ తహసీల్దార్ ఎండీ ఎక్బాల్, శంభునిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్ను జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, పోచమ్మమైదానంలోని ఎస్ఆర్ హైస్కూల్ సెంటర్, దేశాయిపేటలోని నాగార్జున హైస్కూల్ సెంటర్, కొత్తవాడలోని గిర్మాజిపేట ప్రభుత్వ పాఠశాల సెంటర్, పైడిపెల్లి హైస్కూల్ సెంటర్లను అదనపు కలెక్టర్ సంధ్యారాణి తనిఖీ చేశారు.
పకడ్బందీగా నిర్వహించాలి:
కలెక్టర్ సత్యశారద
నర్సంపేట: జిల్లాలో టెన్త్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. నర్సంపేటలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చే యాలన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్, అధికారులు పాల్గొన్నారు. అలాగే ధర్మారంలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.


