గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం గొర్రెకుంట శివారులోని కట్టమల్లన్న (మల్లికార్జున స్వామి) కల్యాణాన్ని నేడు (ఆదివారం) వైభవంగా జరపనున్నట్లు ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, మ్యాదరబోయిన వంశీయులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం రాత్రి 10 గంటలకు దేవతా మూర్తుల ఉత్సవ విగ్రహాలను గొర్రెకుంట గ్రామంలోని కట్టయ్య ఇంటి నుంచి తోడ్కొని వెళ్లి ఆలయం వద్ద అమ్మవార్లు గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మతో కల్యాణం జరపనున్నట్లు తెలిపారు. ఒగ్గు పూజారులు ఆలయం వద్ద పెద్ద పట్నం వేస్తారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
జనగణనపై రెండో రోజు శిక్షణ
న్యూశాయంపేట: దేశాభివృద్ధికి ప్రభుత్వ పథకాల అమలుకు జనగణన–27 కీలకమని డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ సంయుక్త సంచాలకుడు డి.సుబ్బరాజు, గణాంక అధికారి సీహెచ్ సతీష్లు తెలిపారు. శనివారం కలెక్టర్ సమావేశ హాల్లో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు రెండో రోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వి.గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, సీపీఓ చంద్రకళ, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు.
కొవ్వొత్తులతో నివాళి
గీసుకొండ: గంగదేవిపల్లి గ్రామాన్ని జాతీయస్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దిన నాయకుడు, మాజీ సర్పంచ్ కూసం రాజమౌళికి గ్రామంలోని మహిళలు శనివారం రాత్రి నివాళులర్పించారు. అమర్ రహే రాజమౌళి.. అంటూ గ్రామంలో నినాదాలు చేస్తూ ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నిన్ను ఎన్నటికీ మరువమంటూ ర్యాలీ నిర్వహించి, ముందుకు సాగారు. సర్పంచ్ కూసం స్వరూపరమేశ్, ఉపసర్పంచ్ మేడిద ప్రశాంత్, నాయకులు గోలి కుమారస్వామి, సీఏ పెండ్లి జనార్దన్, యువకులు పాల్గొన్నారు. రాజమౌళి ఆశయాలను, ఆయన అందించిన స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు.
నేటి నుంచి ఇంటర్ మూల్యాంకనం
కాళోజీ సెంటర్: జిల్లాలో ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ క్యాంప్ నేటి నుంచి ప్రారంభం కానుందని డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ నేడు (ఆదివారం) లాల్ బహదూర్ జూనియర్ కళాశాలలో ఇంగ్లిష్, గణితం, తెలుగు, సివిక్స్, హింది సబ్జెక్టులు ప్రారంభమవుతాయన్నారు. ప్రతీ రోజు ఒక్కో ఎగ్జామినార్ 30 పేపర్ల మూల్యాంకనం చేయాలని, చీఫ్ ఎగ్జామినర్, విషయ నిపుణులు మూల్యాంకనాన్ని పర్యవేక్షించాలన్నారు. మూల్యాంకన కేంద్రంలో సెల్ ఫోన్ల వినియోగం నిషేధమన్నారు. బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి తప్పిదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో కోడింగ్ అధికారులు మాధవరావు, శోభాదేవి, సంపత్కుమార్, విష య నిపుణులు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.


