రాంపూర్ డంపింగ్యార్డు నుంచి పొగ, విషవాయువులు
● శ్వాసకోశ, చర్మ వ్యాధులబారిన
పడుతున్న ప్రజలు
● రూ.కోట్లు ఖర్చుచేసినా
ప్రారంభంకాని చెత్త రీసైక్లింగ్
కాజీపేట అర్బన్: డంపింగ్యార్డు నుంచి వెలువడే పొగతో మడికొండ, రాంపూర్ గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పలువురు వ్యాధులతో బాధపడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. కాజీపేట మండలం రాంపూర్ గ్రామంలో 2011 సంవత్సరంలో 36 ఎకరాల్లో చెత్తను పోగుచేసేందుకు డంపింగ్యార్డును ఏర్పాటు చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు పూట గడవడమే కష్టంగా ఉండగా.. మూలిగే నక్క మీద తాటికాయపడిన చందంగా డంపింగ్యార్డు నుంచి వెలువడుతున్న పొగ, విషవాయువులతో చర్మ వ్యాధులు, శ్వాసకోస వ్యాధుల బారినపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరి అప్పుల పాలవుతున్నారు.
రోజుకు 500 టన్నుల చెత్త..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లు ఉన్నాయి. ప్రతిరోజూ 300 స్వచ్ఛ ఆటోలు, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా సుమారు 500 టన్నుల చెత్త డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. కాగా, ఎప్పటి చెత్తను అప్పుడు రీసైక్లింగ్ చేయాలి. చెత్త నుంచి కాగితాలు, పీచు, ఖాళీ బాటిళ్లు, మూతలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, సుమారు 24 రకాల వ్యర్థాలను వేరు చేసి సంబంధిత ఫ్యాక్టరీలకు పంపిచాలి. కాగా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.16 కోట్లతో రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. 36 ఎకరాల్లోని 16 ఎకరాల్లో పేరుకుపోయిన లక్షల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేయాలని సంకల్పించా రు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ప్లాంట్ల నిర్వహణ సరిగాలేక రీసైక్లింగ్ ప్రక్రియ ఆగిపోయింది. తిరిగి ప్రస్తుత ప్రభుత్వ హయంలో రూ. నాలు గు కోట్లతో నాలుగు రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసినా ఫలితం మాత్రం శూన్యం. అవి కూడా పని చేయడం లేదు. దీంతో గుట్టలు గా పేరుకుపోయిన లక్షల టన్నుల చెత్త మంటల్లో చిక్కుకుంటే ఫైరింజన్లతో ఆర్పివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి డంపింగ్యార్డు ను తరలించాలని ప్రజలు
కోరుతున్నారు.


