● డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు
కాశిబుగ్గ: గర్భస్థ ముఖద్వార క్యాన్సర్ రాకుండా హెచ్పీవీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, ఈ టీకా బాలికలకు రక్షలాంటిదని వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశిరావు తెలిపారు. వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 – 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. కౌమార దశలో ఉన్న అర్హత గల ఆడపిల్లలు తప్పనిసరిగా యు విన్ ఫోర్టల్లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సహాయంతో తమ పేర్లు నమోదు చేసుకుని వ్యాక్సినేషన్ తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సంపేట, సీకేఎం, ఎంజీఎం, వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం దశలవారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మిదేవి మాట్లాడుతూ హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రాముఖ్యంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, అర్హత కలిగిన బాలికలకు వ్యాక్సినేషన్ ఇప్పించడంలో ఆశ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్, డాక్టర్ స్వరూప, డాక్టర్ స్వర్ణసుధ, ఆర్ఎంఓ డాక్టర్ మురళి, స్థానిక వైద్యాధికారి డాక్టర్ దిలీప్కుమార్, డిప్యూటీ డెమో అనిల్కుమార్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


