
మూడు నెలల రేషన్ కోసం మూడు రోజులు లైన్లో!
హన్మకొండ అర్బన్:
మండుతున్న ఎండలో రేషన్ షాపుల వద్ద బియ్యం కోసం జనం అల్లాడుతున్నారు. ప్రభుత్వం మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండడంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ వైపు ఇరుకు గదుల్లో షాపులు, మరోవైపు మండుతున్న ఎండలు, తాగేందుకు నీరు, నిల్చునేందుకు నీడలేక రేషన్ లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. మరో వైపు సర్వర్ డౌన్ కారణంగా గంటలు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నగరంలో దాదాపు అన్ని రేషన్ షాపుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కనీస వసతుల విషయంలో జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో జనం ఆపసోపాలు పడుతున్నారు.
ఒక్కొక్కరికి పది నిమిషాలు..
ప్రస్తుతం ఒక్కో కార్డుకు మూడు నెలల బియ్యం ఇస్తుండడంతో నెలకు ఒక సారి చొప్పున ముడు సార్లు కాంటా వేయాలి. మూడు సార్లు లబ్ధిదారుడు బయోమెట్రిక్ ఇవ్వాలి. వాతావరణం వేడిగా ఉండడం, ఒకేసారి అందరు ఉపయోగిస్తుండడంతో సర్వర్ మొరాయిస్తోంది. ఒక్కరికి కనీసం పది నిమిషాల సమయం పడుతోంది. అది కూడా సర్వర్ సరిగ్గా ఉంటే.. దీనివల్ల గంటకు కేవలం ఐదు, లేదా ఆరుగురికి మాత్రమే రేషన్ ఇవ్వగలుగుతున్నట్లు రేషన్ డీలర్లు చెబుతున్నారు.
బియ్యం ఐపోతాయని..
రాష్ట్రంలో ఎక్కడి వారైనా.. ఎక్కడైనా రేషన్ తీసుకునేందుకు అవకాశం ఉండడంతో తమకు బియ్యం వస్తాయో రావో అనే బెంగతో జనం షాపులు తెరవక ముందు నుంచే బస్తాలు, చెప్పులు, వాటర్ బాటిళ్లు లైన్లో పెట్టి ఉంచుతున్నారు. షాపు తీయగానే జనం విరగబడుతున్న పరిస్థితులు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. దీంతో.. డీలర్లు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంటోంది. డీలర్లు టోకెన్ పద్ధతిని ప్రారంభించారు. ఉదయం షాపు తీయడానికి అరగంట ముందు రోజుకు 50 టోకెన్లు ఇస్తున్నారు. ఇచ్చిన 50 మందికి పూర్తిగా మూడు నెలల రేషన్ ఇస్తే సాధారణ రోజుల్లో 150 మందికి ఇచ్చినట్లు లెక్క. దీనివల్ల అంతకన్నా ఎక్కువ టోకెన్లు ఇవ్వలేనమని డీలర్లు చెబుతున్నారు.
కొత్త సాఫ్ట్వేర్తో ఇబ్బందులు
ఇటీవల పౌరసరఫరాల శాఖ రేషన్ డీలర్ల వద్ద ఉన్న ఈ పాస్ మిషన్లలో కొత్త సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసింది. దీనిలో కేంద్ర ప్రభుత్వ కోటా ఒక్క వ్యక్తికి ఐదు కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం కోటా ఒక కిలో బియ్యం విడివిడిగా నమోదు చేయాలని, విడిగా తూకం వేయాలని చెప్పారు. దీంతో మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ క్రమంలో ఒక్కొక్కరి నుంచి ఆరుసార్లు బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఆరుసార్లు తూకం వేస్తున్నారు. దీంతో రోజంతా ఈ ప్రక్రియ కొనసాగినా ఒక్కో డీలర్ 15 మందికి కూడా బియ్యం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి గమనించి దిద్దుబాటుగా నెలకు రెండు సార్లు బదులు ఒక్కసారి తూకం వేసేలా మార్పు చేశారు. దీనికితోడు గతంలో కన్నా అదనంగా సమాచారం నమోదు చేయాల్సి వస్తుండడం అనవసర ఆప్షన్లు ఎక్కవగా ఉండడంతో సమయం వృథా అవుతోందని డీలర్లు చెబుతున్నారు.
పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్యం
క్షేత్రస్థాయిలో ఇంత జరగుతున్నా.. జిల్లా పౌరసరఫరాల అధికారులు మాత్రం రేషన్ షాపుల వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. సాధారణంగా రేషన్ షాపులకు బియ్యం నెలాఖరులో చేరవేస్తారు. నెల ఒకటో తారీఖు నుంచి 15వ తేదీ వరకు పంపిణీ చేసి అధికారులకు లెక్కలు అప్పగిస్తారు. మిగిలిన స్టాకునుబట్టి తదుపరి నెలకు కోటా కేటాయిస్తారు. అయితే ప్రస్తుతం మూడు నెలల కోటా విషయంలో జనం అయోమయానికి గురవుతున్నారు. ఎప్పటి మాదిరిగానే 15వ తేదీ వరకు షాపులు క్లోజ్ చేస్తారని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈవిషయంలో పౌరసరఫరాల శాఖ అధికారులు కార్డుదారులకు కనీసం భరోసా ఇవ్వలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు షాపుల వద్ద పరిస్థితిని పర్యవేక్షించడం లేదని అంటున్నారు. ఎండ మండుతున్నందున షాపుల వద్ద టెంట్లు వేయించడం, తాగునీరు అందుబాటులో ఉంచడం కూడా చేయడం లేదని రేషన్ లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఒక్కో వ్యక్తికి మూడు నెలల బియ్యం చేతికి అందాలంటే కనీసం మూడు రోజులపాటు లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు.
నెలాఖరు దాకా పంపిణీ
నెలాఖరుదాకా బియ్యం ఇస్తాం. ఎవరూ ఆందోళన చెందవద్దు. ఈ విషయం అధికారులు చెబితే ప్రజలు నమ్ముతారు. గతంలో మాదిరిగా 15వ తేదీ వరకు అనుకుని జనం ఎగబడుతున్నారు. సర్వర్ సమస్య తీవ్రంగా ఉంది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే మంచిది. ఎండల వల్ల జనం ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. – మహేశ్వరం గౌరీశంకర్,
హనుమకొండ డీలర్ల సంఘం అధ్యక్షుడు
ప్రజలకు అవగాహన కల్పించని సివిల్సప్లయ్ అధికారులు
నీరు,
నీడ లేక జనం
అవస్థలు
జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు
2,31,516
పంపిణీ చేస్తున్న బియ్యం
(మూడు నెలల కోటా)
1,28,17,586
(మె.టన్నులు)

మూడు నెలల రేషన్ కోసం మూడు రోజులు లైన్లో!

మూడు నెలల రేషన్ కోసం మూడు రోజులు లైన్లో!