న్యూస్రీల్
రైతుల భూములు కాపాడండి
మంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2026
సీ్త్ర, శిశు సంక్షేమంపై కూటమి ప్రభుత్వం కినుక వహిస్తోంది. పౌష్టికాహారం సరఫరాలోనే జాప్యం చేస్తోంది.
ఎల్నినో దెబ్బకు వర్షాలు ముఖం చాటేశాయి. ఇప్పటికే సమృద్ధిగా వర్షాలు కురిసి వాతావరణం చల్లబడాల్సి ఉండగా తీవ్రమైన వేడిమితో జిల్లా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు.
విజయనగరం గంటస్తంభం:
అర్హత ఉన్నా తల్లికి వందనం అందలేదంటూ పలువురు తల్లులు.. అడ్డగోలుగా చేపట్టిన భూ సేకరణ వల్ల నిరాశ్రయులమవుతామంటూ రైతులు, విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు.. భూ హక్కుల కోసం మహిళలు.. పింఛన్ల కోసం దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు.. ఇలా వేర్వేరు సమస్యలపై వందలాది మంది కలెక్టరేట్ వేదికగా తమ ఆవేదన వ్యక్తంచేశారు. పీజీఆర్ఎస్లో వినతులు అందజేశారు. అధికారులకు తమ గోడు వినిపించారు. సమస్యలు పరిష్కరించాలంటూ వేడుకున్నారు.
ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలి
నీట్ పరీక్షల నిర్వహణలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను వెంటనే రద్దు చేయాలని సీపీఐ నాయకులు, నిరుద్యోగులు కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. విద్యార్థుల ఉద్యమాల ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, వ్యవస్థలో మార్పులు తీసుకురాకపోతే సమస్య పరిష్కారం కాదన్నారు. విద్యార్థులను కోల్పోయిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ, సహాయ కార్యదర్మి బుగత అశోక్, జిల్లా వర్గ సభ్యులు భీముడు, రంగరాజు, పావని, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
వీల్చైర్లో కూర్చున్నది గంట్యాడ మండలంలోని లక్కిడాం గ్రామానికి చెందిన కిలపర్తి నాయుడుబాబు. దివ్యాంగుడు. ఈయన ఇద్దరు కుమారైలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా రెండేళ్లుగా తల్లికి వందనం పథకం వర్తించడం లేదు. హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఇతరుల వివరాలు లింక్ అయ్యాయని అధికారులు చెబుతున్నారని, ఎన్నిసార్లు తిరిగినా సరిచేయడంలేదని వాపోయాడు. ప్రభుత్వ సాయం అందకపోతే మా పిల్లల చదువుల పరిస్థితి ఏమిటంటూ కన్నీరుపెట్టారు. తన భార్యతో కలిసి పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశాడు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువకు ప్రతిపాదించిన ఎలైన్మెంట్ను మార్చాలని పలువురు రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ప్రత్యామ్నాయ డిజైన్తో తక్కువ భూసేకరణ, తక్కువ వ్యయంతో ప్రాజెక్టు పూర్తవుతుందని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ ఎలైన్మెంట్ను నిపుణులతో పరిశీలించే వరకు భూసేకరణ నోటిఫికేషన్లు నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్మి బి.రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు లోకవరపు ఆదినారాయణమూర్తి పాల్గొన్నారు.
భోగాపురం మండలానికి చెందిన సైన్స్ ఉపాధ్యాయుడు ముద్దన శ్రీనివాసరావు, ఆయన భార్య ధనలక్ష్మి చీటీల పేరిట సుమారు రూ.10 కోట్ల మేర మోసం చేశారని, ఆదుకోవాలంటూ బాధితులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. సుమారు 150 మంది నుంచి చీటి డబ్బులు వసూలు చేసి తిరిగి చెల్లించలేదని ఆరోపించారు. న్యాయం చేయాలంటూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.


