విజయనగరం ఫోర్ట్: ఎల్నినో పరిస్థితులను అధిగమించేందుకు రైతాంగాన్ని సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి వ్యవసాయశాఖ అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్లో మంగళవారం మాట్లాడారు. వర్షాధార భూము ల్లో రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమిచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. ఎరువులు పక్కదారి పట్టించే డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు, డీడీ జి.రామారావు, పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్ మన్మథరావు, తదితరులు పాల్గొన్నారు.
న్యాయ సేవా కేంద్రం ఏర్పాటు
విజయనగరం లీగల్: కక్షిదారులకు అవసరమైన న్యాయసేవా కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత న్యాయ సేవా కేంద్రంలో మన దేశంలో ఈశాన్య రాష్టాలకు చెందిన కక్షిదారులు, బాధితులకు ఉచిత న్యాయసేవలు అందుతాయన్నారు. కార్యక్రమంలో ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఒ.విజయకల్యాణి, మొదటి శ్రేణి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అప్పలస్వామి, ఫ్యామిలీ కోర్టు మూడవ అదనపు జిల్లా జిడ్జి శ్రీధర్, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎ.దుర్గయ్య, జడ్జిలు కృష్ణప్రసాద్, రమేష్నాయుడు, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, ఎన్ఎస్హెచ్ఆర్ తేజా చక్రవర్తి, మేజిస్ట్రేట్ బుజ్జి, మొబైల్, ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బెల్లాన రవి, విజయనగరం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నలితం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాముల తనిఖీ
నెల్లిమర్ల: నెల్లిమర్ల ఈవీఎం గోదాములను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మంగళవారం త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. గోదాం షట్టర్లకు వేసిన సీళ్లను, తాళాలను తెరిపించి లోపలి గదులను, సీళ్లను పరిశీలించారు. మొదటి అంతస్తులో ఉన్న గోదామును సైతం తనిఖీ చేశారు. పోలీసు బందోబస్తుపై సమీక్షించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు, పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. తనిఖీల్లో ఆర్డీఓ ఎస్.సుధాసాగర్, నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్, ఎన్నికల విభాగం డీటీ పి. కీర్తన, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ప్రసాదరావు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సముద్రపు రామారావు, ఇతర పార్టీల నాయకులు బి.వి.రమణ, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
● హాజరుకానున్న 1801 మంది అభ్యర్థులు
విజయనగరం అర్బన్: జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న రీ–నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 1,801 మంది విద్యా ర్థులు హాజరుకానున్నారని, ఆదివారం మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్షను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే 08922–236947 నంబర్ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
నీట్ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం
నీట్ రీ–ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థులకు ఆర్టీసీ ప్రత్యేక ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయనగరం నుంచి శ్రీకాకుళం, పార్వతీపురం, రాజాం, విశాఖపట్నం, గాజువాక, కూర్మన్నపాలెం, ఎస్.కోట, ఆండ్ర, జక్కువ, సింహాచలం, అనకాపల్లి ప్రాంతాలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. వసంత, షికారుగంజి, బొప్పడాం, గరికివలస, కొండగండ్రేడు, కందివలస, చింతపల్లి, తిప్పలవలస తదితర గ్రామాల అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సు నడపనున్నట్లు వెల్లడించారు.


