జల్జీవన్ మిషన్ పథకం కింద జిల్లాకు 1438 పనులు మంజూరయ్యాయి. 1218 పనులు పూర్తయ్యాయి. 220 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.395 కోట్లు మంజూరుకాగా రూ.137 కోట్లు ఖర్చయ్యాయి. రూ.40 కోట్ల వరకు బిల్లులు అప్లోడ్ చేశారు. బిల్లులు చెల్లించాల్సి ఉంది.
– కవిత, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్
విజయనగరం ఫోర్ట్:
జల్జీవన్ మిషన్ (జేజేఎం) పథకంపై చంద్రబాబు సర్కారు కినుక వహిస్తోంది. పనులకు నిధులు విదల్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పల్లెల్లో ప్రతిఇంటికి కులాయి కనెక్షన్లు ఏర్పాటు చేసి సురక్షితమైన తాగునీరు సరఫరా చేయాలన్న పథక లక్ష్యానికి తూట్లుపొడుస్తుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్రం సాయంతో ప్రతిష్టాత్మకంగా తాగునీటి సరఫరా పనులు చేపట్టిందన్న అక్కసుతోనే పథకాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
● జిల్లాకు 1438 పనులు మంజూరు
జల్జీవన్ మిషన్ పథకం కింద జిల్లాకు 1438 పనులు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 1218 పనులు పూర్తయ్యాయి. 220 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనుల కోసం రూ.395 కోట్లు కేటాయించగా, ఇందులో ఇంతవరకు రూ.137 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధుల్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే అత్యధికశాతం రూ.124 కోట్లు ఖర్చుచేశారు. టీడీపీ సర్కారు వచ్చిన రెండేళ్లలో జల్జీవన్ మిషన్ పనులకు చేసిన ఖర్చు రూ.13 కోట్లే కావడం గమనార్హం.
● బిల్లులు చెల్లించని వైనం
జల్జీవన్ మిషన్ పనులకు సంబంధించి గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్య విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు 8 నెలల కిందట రూ.40 కోట్లకు పైబడి బిల్లులు అప్లోడ్ చేశారు. వీటికి సంబంధించి ఇంతవరకు టీడీపీ సర్కారు బిల్లులు చెల్లించలేదు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జల్జీవన్ మిషన్ పథకాన్ని నీరుగార్చేందుకే టీడీపీ సర్కారు బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూ.13 కోట్లు
ప్రస్తుత ప్రభుత్వం
రెండేళ్లలో పనులకు వెచ్చించిన సొమ్ము
పథకాలు ఉన్నా..
జిల్లాలో పీడబ్ల్యూస్కీమ్స్ (ఒక్క గ్రామానికి తాగునీరు అందించే ) పథకాలు 951 ఉన్నాయి. సీపీడబ్ల్యూ స్కీమ్స్ (ఒకటి కంటే ఎక్కువ గ్రామాలకు తాగునీరు అందించే ) పథకాలు 30 ఉన్నాయి. జల్జీవన్ మిషన్ పనులు శతశాతం పూర్తి కాకపోవడం వల్ల గ్రామీణ ప్రజలకు ఇంటింటికీ తాగునీరు అందక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ దూర ప్రాంతాల నుంచి తెచ్చిన నీటితోనే దాహం తీర్చుకుంటున్నారు.


