వంగర: మండల పరిధి ఓనె అగ్రహారం గ్రామంలో ఉపాధిహామీ పనులు చేస్తుండగా గ్రామానికి చెందిన పెడన ఈశ్వరమ్మ పాముకాటుకు గురైంది. ఈ మేరకు మంగళవారం స్థానిక బందకాలువ గట్టుపై పనులు చేస్తుండగా రక్తపింజర ఆమెను కాటు వేయడంతో వేతనదారులు పామును హతమర్చారు. బాధితురాలిని వంగర పీహెచ్సీకి తీసుకువెళ్లగా వైద్యాధికారిణి సుస్మిత దయానా ప్రాథమిక చికిత్స అనంతరం రాజాం సీహెచ్సీకి 108 వాహనంలో తరలించారు.
సెల్ఫోన్ల రికవరీ
శృంగవరపుకోట: చోరీకి గురైన సెల్ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడంలో ఎస్.కోట పోలీసులు చురుగ్గా ఉన్నారు. ఇటీవల చోరీకి గురైన సెల్ఫోన్లను ట్రేస్ చేసి రూ.60వేల ఐక్యూ00, రూ.25వేల మోటోరోలా, రూ.16వేల వివో, రూ.20వేల రెడ్మీ, రూ.20వేల ఒప్పో, రూ.15వేల వివో, రూ.19వేల రియల్మీ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని ఎస్.కోట సీఐ నారాయణమూర్తి స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం ఫిర్యాదుదారులకు అందజేశారు. ఫోన్ల వాడకంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, తెతిసీతెలియక చేసే తప్పిదాలతో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని సూచించారు.
సెప్టిక్ ట్యాంకర్ ఢీకొని
ముగ్గురికి గాయాలు
సీతంపేట: సెప్టిక్ ట్యాంకర్ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు గాయాలపాలయ్యారు. సీతంపేటలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. నాయుడు మల్లి గ్రామం నుంచి సీతంపేటకు విద్యుత్ లైన్మన్ పాలక నాగేశ్వరరావు ఆయన కుమారుడు రోహిత్ ద్విచక్రవాహనంపై వస్తున్నారు. కొత్తూరు నుంచి పాలకొండవైపు ఎదురుగా వస్తున్న సెప్టిక్ ట్యాంకర్ కొండపల్లి గ్రామం వద్దకు వచ్చేసరికి వారి బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఇదే క్రమంలో సైకిల్ తొక్కుకుని పక్క నుంచి కె.శివశంకర్ అనే విద్యార్థి వస్తుండగా ట్యాంకర్ తగిలి కిందపడడంతో స్వల్పగాయాలైనట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


