విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ–గురజాడలో అంతర్జాతీయ సమగ్ర బ్యాచిలర్ – మాస్టర్స్ ప్రోగ్రామ్ (ఐఐబీఎంపీ) 2026 ప్రవేశాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. జేఎన్టీయూ జీవీ జర్మనీలోని నాలెడ్జ్ ఫౌండేషన్–ర్యూట్లింగెన్ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐఐబీఎంపీతో విద్యార్థులు జేఎన్టీయూ–జీవీ నుంచి బీటెక్ డిగ్రీతో పాటు జర్మనీ ర్యూట్లింగెన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందే అరుదైన అవకాశాన్ని పొందనున్నారు. ఈ అంతర్జాతీయ విద్యా కార్యక్రమం విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య, విదేశీ విద్యా అనుభవం, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూపొందించిందని జేఎన్టీయూ జీవీ అధికారులు తెలిపారు. జర్మనీ విద్యావిధానం, పరిశోధన, పరిశ్రమలతో అనుసంధానమైన అభ్యాసంతో విద్యార్థుల భవిష్యత్తుకు మరింత బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు.
అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లు బీటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – ఎంఎస్సి (ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్) బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్) – ఎంఎస్సి (డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్) కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు జేఎన్న్టీయూ–గురజాడ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో ర్యూట్లింగెన్ యూనివర్సిటీ, జర్మనీ నుంచి మాస్టర్స్ డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఫోన్ 78915 88999, 78914 88999 నంబర్లను, విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.


