● రెడ్ క్రాస్ చైర్మన్ వెంకటరమణ
విజయనగరం ఫోర్ట్: రక్తదానం ప్రాణదానమని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కె. వెంకటరమణ అన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో సాధన యువజన సంఘం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అత్యధికసార్లు రక్తదానం చేసిన వ్యక్తులను సన్మానించారు. మనిషి మాత్రమే ఆపదలో ఉన్న సాటిమనషికి రక్తం దానం చేసి ప్రాణాలు కాపాడగలడన్నారు. రక్తాన్ని తయారు చేయలేం కాబట్టి రక్తదానం ద్వారానే రక్తం కొరతను తీర్చవచ్చునన్నారు. రక్తదానంపై అపొహలు విడనాడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ రావు, అకోక్, మణికంఠ, స్వామి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
అదుపులో ఇద్దరు అనుమానితులు
● స్వర్ణకారుడిపై దాడి కేసులో
దర్యాప్తు ముమ్మరం
పార్వతీపురం రూరల్: చౌకగా బంగారం ఇప్పిస్తానని నమ్మించి..విజయవాడకు చెందిన స్వర్ణకారుడిపై ఇటీవల ఆంధ్ర–ఒడిశా సరిహద్దు బట్టివలస వద్ద దుండగులు దాడి చేసి రూ.2 లక్షలు దోచుకెళ్లిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒడిశాలోని అలమండ బ్లాక్ పిప్పల భద్ర గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నేరానికి ఉపయోగించిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీ వెనుక సుమారు పది మంది హస్తం ఉన్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. బాధితుడికి ’డమ్మీ రాజు’ పేరుతో వలవేసిన ఈ ముఠాకు గతంలో సదరు వ్యాపారితో ఏవైనా లావాదేవీలు ఉన్నాయా? లేక ఇతర చీకటి వ్యాపారాల నేపథ్యం ఉందా? అన్న కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. కేవలం ఈ ఘటనే కాకుండా, ఇటీవల సరిహద్దుల్లో జరిగిన పలు ఇతర నేరాలతో వారికి ఉన్న సంబంధాలపై కూడా విచారణ చేస్తున్నారు. ఒడిశా వైపు వెళ్లే మార్గాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తూ, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మిగిలిన నిందితులను పట్టుకునేందుకు చర్యలు వేగవంతం చేశారు.


