విజయనగరం అర్బన్: తారకరామ తీర్ధసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రాజెక్టు పురోగతిపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులపై అధికారులతో సమీక్షిస్తూ మొత్తం రూ.110 కోట్ల పరిపాలన అనుమతుల కోసం తక్షణమే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించి త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల ప్రజలతో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని, సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఆర్డీఓ సుధాసాగర్, ఇరిగేషన్ జాఖ అధికారులు పాల్గొన్నారు.
పరిశ్రమల స్థాపన వేగవంతం చేయాలి
జిల్లాకు మంజూరైన పరిశ్రమలు, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆమోదం పొందిన పరిశ్రమలు వేగంగా అమలు కావాలని ముఖ్యంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు, ఫుడ్ పార్క్లు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన ఎంఓయూలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పరిశ్రమలకు అవసరమైన లాజిస్టిక్స్ సదుపాయాలను కూడా సమర్ధవంతంగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు సుధాసాగర్, సుధారాణి, రామ్మోహన్రావు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.


