పూసపాటిరేగ: మండలంలోని తమ్మయ్యపాలెం సముద్రపు రేవులో పడవ బోల్తాపడి ఒకరు మృతి చెందగా, ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. వివరాల్లోకి వెళ్తే.. పతివాడ పేటకుచెందిన వాసుపల్లి ఎల్లయ్య (50) తన సహచరులతో కలిసి శుక్రవారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో సముద్రంలో చేపలవేటకు బయలు దేరాడు. కొద్ది క్షణాల్లోనే కెరటాల ఉధృతికి పడవ బోల్తా పడడంతో ఎల్లయ్య గల్లంతయ్యాడు. అదే పడవలో ఉన్న ముగ్గురు మత్స్యకారులు అతి కష్టం మీద సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన ఎల్ల య్య కోసం పలువురు మత్స్యకారులు గాలించగా సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో చింతపల్లి రేవులో శవమై ఒడ్డుకు చేరాడు. సమాచారం మేరకు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురు సురక్షితం


