విజయనగరం క్రైమ్ : విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి సీఐ నరసింహమూర్తి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. చెల్లూరు చెందిన 19 ఏళ్ల యువకుడు, 15 ఏళ్ల బాలిక ఏడాదిగా ప్రేమించు కుంటున్నారు.బాలికతో తరచూ మాట్లాడడం కోసం యువకుడు బాలికకు సెల్ఫోన్ కూడా కొని ఇచ్చాడు. ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని షికార్లు తిరిగారు. రెండు రోజుల క్రితం వీటీ అగ్రహారంలో ఉంటున్న బాలికకు వాంతులు కావడంతో తల్లికి చెప్పింది. ఆపై భరించలేనంత కడుపు నొప్పి రావడంతో పరీక్ష చేయగా గర్భిణిగా తేలింది. వెంటనే కన్న వారు స్థానిక ఘోషా ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ నుంచి మహిళా పోలీస్ స్టేషన్కు బాలిక తల్లి వచ్చి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ రాఘవులు స్థానిక ఘోషా హాస్పిటల్కు వెళ్లి బాలిక నుంచి వివరాలు తెలుసుకుని చెల్లూరు కు చెందిన కేశవ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దర్యాప్తులో బాలిక పై చేసిన ఘోరం రుజువు కావడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
కామేశ్వరరావుకు లాస్యప్రియ ఉగాది ప్రతిభా పురస్కారం
విజయనగరం టౌన్: ప్రముఖ కూచిపూడి నృత్య దర్శకుడు, ధర్మాస్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు పీఎస్వీ.కామేశ్వరరావుకు ఇండియన్ కల్చరల్ ఆర్ట్ ఫెస్టివల్లో భాగంగా రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో లాస్యప్రియ ఉగాది ప్రతిభా ఆచార్య పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాస్యప్రియ కూచిపూడి నృత్యనికేతన్ వ్యవస్థాపకుడు మేడిది నాగేశ్వరరావు చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన కూచిపూడి సంస్థల ప్రతినిధులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.


