పూసపాటిరేగ: భోగాపురం మండలం నారుపేట వద్ద జాతీయరహదారిపై ఆదివారం సాయంత్రం నెమ్మదిగా వెళ్తున్న లగేజీ ఆటోను వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో 13 మందికి గాయాలయ్యాయి. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు అదే దిశగా ప్రయాణికులతో వెళ్తున్న లగేజీ ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో గాయపడిన వ్యక్తులను సుందరపేట ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న డి.దేవి, కె.సావిత్రి, డి.నాగమణి, డి. లావణ్య, డి.లక్ష్మీదేవి, డి.నిహారిక, డి.మీనాక్షి, డి.రోహిణి, డి. శశాంక్కు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు అవడంతో సంఘటనా స్థలం నుంచి విజయనగరంలోని ఓ పైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులు రాజాం మండలం శ్యాంపురం గ్రామస్తులు కాగా వారు జీవనోపాధి నిమిత్తం విశాఖ సుజాత నగర్లో నివాసం ఉంటున్నారు, శ్రీకాకుళం సమీపంలో రాజులమ్మ ఆమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో సుజాతనగర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.కారులో ప్రయాణిస్తున్న రణస్థలం మండలం జీరుపాలెంకు చెందిన డి. సుశీల, డి.రాముడుకు గాయాలయ్యాయి. వారికి సుందరపేట ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ మేరకు భోగాపురం సీఐ కె. దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురి పరిస్థితి విషమం


