గుమ్మలక్ష్మీపురం: ఇంటి బయట నిద్రిస్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు, తాడును గుర్తు తెలియని వ్యక్తి లాక్కొని పారిపోయిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతవీధికి చెందిన సుజాత ఉక్కపోత కారణంగా ఇంటి బయట నిద్రించింది. శనివారం వేకువజామున 4.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సుజాత మెడలోని బంగారు గొలుసు లాక్కొని, మళ్లీ మెడలోని బంగారు తాడును కూడా లాక్కొనేందుకు ప్రయత్నించగా మెలకువ వచ్చి ప్రతిఘటించింది. బంగారు తాడు తెగిపోవడంతో సదరు వ్యక్తి అక్కడ నుంచి పరారయ్యాడు. సుజాత తేరుకుని చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. గుర్తు తెలియని వ్యక్తి కోసం వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆమె ఎల్విన్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ బి.హరి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అపహరణకు గురైన ఆభరణాలు సుమారు మూడు తులాల వరకు ఉంటుందని తెలిపింది.


