పార్వతీపురం రూరల్ : మలేరియా నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎస్.భాస్కరరావు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా ఆరోగ్య కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి వారం డ్రై–డే పాటించాలని సూచించారు. దోమ తెరలు వాడటం, లార్వా వృద్ధిని అరికట్టడం ద్వారానే వ్యాధిని నియంత్రించగలమన్నారు. మా ఊరికి మలేరియా వచ్చింది కార్యక్రమంతో శాఖల మధ్య సమన్వయం పెరిగిందని, ఇది మలేరియా నివారణకు తోడ్పడుతోందని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో జ్వర సర్వే నిర్వహించి బాధితులను త్వరగా గుర్తించాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సూర్యనారాయణ, వైద్యులు విజయమోహన్, జగన్మోహనరావు, సూర్యకౌశిక్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ భాస్కరరావు


