● చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరి
● న్యాయం కోసం మండుటెండలో మహిళల పోరాటం
అక్కడో మాట..
ఇక్కడో ఆట!
సాక్షి, పార్వతీపురం మన్యం:
చెప్పేవి మహిళా పక్షపాతి మాటలు.. చేసేవి మహిళలను రోడ్డుకీడ్చే చేష్టలు! చంద్రబాబు ప్రభుత్వంలో ఓ మహిళా మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో న్యాయం కోసం అయిదుగురు అబలలు మండుటెండలో గత బుధవారం నుంచి పార్వతీపురంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాజకీయ చదరంగంలో అన్యాయంగా ఉద్యోగాలు పోగొట్టుకుని, పొట్టచేత పట్టుకుని ఆకలి కేకలు పెడుతున్నారు. లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, ‘ఆమె’కు సమాన హక్కులు అంటూ డ్రామాలు చేస్తున్న పాలకులు... తమ సొంత రాష్ట్రంలో.. సాక్షా త్తు సీ్త్రశిశు సంక్షేమ మంత్రి ఇలాకాలో ఆడ బిడ్డలు.. అందునా చిరుద్యోగులు బలైపోతే... వారి ఆవేదన మన్యం గడప దాటకపోవడం గమనార్హం. గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఒత్తిడి వల్లే కలెక్టర్, విద్యాశాఖ అధికారులు సాలూరు మండలం కరాసువలస కేజీబీవీ ప్రిన్సిపాల్ సహా ఇతర సిబ్బందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ.. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించబోమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గానీ ఎప్పటికి స్పందిస్తారో చూడాలి.


