● ఎన్సీడీ జిల్లా అధికారి జగన్మోహనరావు
పార్వతీపురం: వేసవి కాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రజల్లో అవగాహన పెంపొందించుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్సీడీ జిల్లా అధికారి డా.టి జగన్మోహన్రావు సిబ్బందికి సూచించారు. మండలంలోని పెదగుడబ పంచాయతీ ఎస్ఆర్పేటను శనివారం ఆయన సందర్శించారు. గ్రామంలో నిర్వహిస్తున్న సంచార వైద్య శిబిరంలో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు, రికార్డులను పరిశీలించారు. కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందుల లభ్యతను పరిశీలించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు మందులు క్రమంగా తీసుకునేలా పర్యవేక్షణ చేయాలని, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనించాలని సిబ్బందికి సూచించారు. వేసవి నేపథ్యంలో వాతావరణ మార్పులు–మానవ ఆరోగ్యం కార్యక్రమం ద్వారా గ్రామంలో పోస్టర్లతో అవగాహన కల్పించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం నీటిని కోల్పోతుందని, దాహం లేకపోయినా తరుచుగా నీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటి ద్రావణాలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు ఎండలో ఎక్కువ సేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శిబిరంలో వైద్యాధికారిణి ఎం.చాందిని, సీహెచ్ఓ ఇంద్రాణి తదితరులు పాల్గొన్నారు.


