విజయనగరం ఫోర్ట్: భారత జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా స్వీయగణనపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విజయనగరం పట్టణంలో ఈ నెల 26వ తేదీ ఉదయం 6 గంటలకు 5కే రన్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. 5కే రన్ పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమై గాంధీ విగ్రహం, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ కూడలి మీదుగా కోటకూడలి వరకు సాగుతుందన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పలు శాఖలకు బాధ్యతలు కేటాయించామన్నారు.
నేడు పాలిసెట్
● జిల్లాలో 7,971 మంది కోసం 26 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
విజయనగరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించనున్న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్) కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 7,971 మంది అభ్యర్థుల కోసం జిల్లా వ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
● విజయనగరం పట్టణంలో మహారాజా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, సత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (సెంటర్–ఏ,బీ,సీ), భాష్యం ఈఎం హైస్కూల్, ఏజీఎల్ కాలేజ్, సత్య డిగ్రీ–పీజీ కాలేజ్, ఆర్కే డిగ్రీ కాలేజ్, పీఎస్ఆర్ స్కూల్, నారాయణ ఈఎం స్కూల్ తదితర కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు.
● నెల్లిమర్లలో సీకేఎం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, బాలాజీ పాలిటెక్నిక్, శ్రీ సాయి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్, గజపతినగరంలో విజేత డిగ్రీ కాలేజ్, శ్రీ కష్ణ జూనియర్ కాలేజ్, శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజ్లను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేశారు.
● చీపురుపల్లిలో జీబీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, జీవీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ కేంద్రాలుగా నిర్ణయించారు. గరివిడిలో ఎస్డీఎస్ కాలేజ్, శ్రీరామ్ జూనియర్ కాలేజ్, బొబ్బిలిలో శ్రీ సాయి డిగ్రీ కాలేజ్, శ్రీ గాయత్రి డిగ్రీ కాలేజ్, ఎస్ఎస్ఎస్ డిగ్రీ కాలేజ్, స్వామి వివేకానంద ఇంజినీరింగ్ కాలేజ్లలో పరీక్షలు జరగనున్నాయి.
ఆన్లైన్లో ఉద్యోగుల పెన్షన్ ప్రపోజల్స్
● జిల్లా ఖజానా గణాంక అధికారి నాగమహేష్
విజయనగరం ఫోర్ట్: ఉద్యోగుల పెన్షన్ ప్రపోజల్ సమర్పణ ఇకపై ఆన్లైన్లో సమ ర్పించాలని జిల్లా ఖజానా అధికారి వి.నాగమహేష్ అన్నారు. జిల్లా ఖజానా కార్యాలయంలో విజయనగరం పరిధిలోని డీడీఓలకు రిటైర్మెంట్ ప్రాసెసింగ్ సిస్టమ్పై శుక్రవారం అవగాహన కల్పించారు. ఉద్యోగుల పెన్షన్, జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఏపీజీఎల్ఐ, ఆర్జిత సెలవులు నగదుగా మార్చుకోవడం, తదితర దరఖాస్తులన్నీ ఆన్లైన్లోని విధి పోర్టల్లో సమర్పించాలన్నారు.
సెలవుల్లో తరగతులు ఎలా నిర్వహిస్తారు?
పూసపాటిరేగ: మండల కేంద్రమైన పూసపాటిరేగలో మాస్టర్మైండ్స్ పాఠశాల యాజమాన్యం విద్యాశాఖ ఆదేశాలు భేఖాతరు చేయడం, సెలవుల్లో పాఠశాల నిర్వహణపై ఎంఈఓ రాజ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. సుమారు 20 మంది వరకు విద్యార్థులు పాఠశాలలో ఉండడంపై ప్రశ్నించారు. తరగతులతో పాటు హాస్టల్ నిర్వహించడం సరికాదని, వేసవి సెలవులను నిబంధనల ప్రకారం వాడుకోవాలని, ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ప్రిన్సిపాల్ను హెచ్చరించారు. వేసవిలో పిల్లలు విశ్రాంతి తీసుకోవడానికి ప్రభుత్వం సెలవులు మంజూరు చేసిందనే విషయాన్ని ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు గ్రహించాలన్నారు.


