సీతంపేట: మన్యం అంటనే మలేరియా పాజిటివ్ కేసులకు పెట్టింది పేరనే నానుడి ఉంది. ఇప్పుడు మన్యంతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా మలేరియా విలయతాండవం చేస్తోంది. గిరిజనగ్రామాల్లో మలేరియా జ్వరాలు ఎక్కువగా విజృంభిస్తున్నాయి. ఏటా జనవరి నుంచి డిసెంబర్ వరకు 700కు పైగా మలేరియా కేసులు నమోదవుతున్నట్లు అధికారిక లెక్కలు. కానీ ఆ సంఖ్య వెయ్యికి పైగానే ఉండొచ్చనేది అంచనా. ఈ ఏడాది ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా కేసులు 110 వరకు నమోదయ్యాయి. అధికారులు 233 గిరిజన గ్రామాలను హైరిస్క్ మలేరియా గ్రామాలుగా గుర్తించి మలేరియా నిర్మూలనా కార్యక్రమాలు చేపడుతున్నారు. జ్వరం వచ్చి రక్తపరీక్షలు చేయించుకుంటే మలేరియా,టైఫాయిడ్ ఈ రెండింటిలో ఏదో ఒకటి రావడం పరిపాటిగా మారింది.
3లక్షల దోమతెరలకు 23 వేలే వచ్చాయి...
మలేరియా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 3లక్షల దోమతెరలు అవసరం కాగా కేవలం 23వేల 339 వందల దోమతెరలు మాత్రమే ఈ సంవత్సరం వచ్చాయి. వాటిని 8 పీహెచ్సీల పరిధిలో మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కడ నమోదవుతున్నాయో అక్కడ పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 12 వేల దోమ తెరలు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.


