విజయనగరం అర్బన్: ప్రభుత్వ ప్రాధాన్యత సూచికల(కీ ఫెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్(కేపీఐ) అమలులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ శాఖల పనితీరును సమీక్షించిన కలెక్టర్ నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ కావడంలో కేపీఐ కీలకమని పేర్కొంటూ వెనుకబడిన శాఖలు తక్షణమే పురోగతి సాధించాలని సూచించారు. అంతకుముందు ప్రణాళికాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాంసుందర్రెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2026–27 సంవత్సరానికి సంబంధించిన 396 ఇండికేటర్లలో అత్యుత్తమ గ్రేడ్లు సాధించేందుకు శాఖల ఉన్నతాధికారులు కృషి చేయాలని కోరారు. మండలాలకు నిర్దేశించిన 199 ఇండికేటర్లలో మెరుగైన పనితీరును ప్రదర్శించాలని సూచిస్తూ ఈ నెల 29వ తేదీ నాటికి అన్ని నివేదికలను సమగ్రంగా సమర్పించాలని ఆదేశించారు. జీఎస్డీపీ లక్ష్యాలను వివరిస్తూ సవరించిన అంచనాలకు అనుగుణంగా మండలాల వారీగా ఎన్డీపీ అంచనాలు రూపొందించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో సీపీఓ పి.బాలాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి


