పీ–4పై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

పీ–4పై సమీక్ష

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

29న రెవెన్యూ అసంతృప్తి దారులతో సమావేశం

విజయనగరం అర్బన్‌: పీ–4 కార్యక్రమంపై కలెక్టరేట్‌ నుంచి వివిధ శాఖల అఽధికారులతో కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి వీడియోకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. బంగారు కుటుంబాల దత్తత, నిధుల రీయింబర్స్‌మెంట్‌, జలధార కార్యక్రమాల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 82,426 బంగారు కటుంబాలను గుర్తించగా ఇప్పటి వరకు 3,941 మంది మార్గదర్శులు 20,157 కుటుంబాలను దత్తత తీసుకున్నట్టు వెల్లడించారు. మిగిలిన కుటుంబాల దత్తతను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎస్‌డీసీ, ఎంపీ ల్యాడ్స్‌ నుంచి వివిధ శాఖలకు సర్దుబాటు కింద అందజేసిన నిధులను ఆయా శాఖలు వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించారు. జలధార, ఉపాధి హామీ పనుల తీరుపై ఆరా తీశారు.

జీతం రికవరీ

విజయనగరం ఫోర్ట్‌: ఎస్‌.కోట ఏరియా ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసిన ఓ వైద్యురాలు ఉద్యోగం చేస్తున్నట్టు జీతం తీసుకోవడం, మరోవైపు పీజీ చదువుతున్నట్టు స్టైఫండ్‌ తీసుకున్నారన్న అంశంపై ఈనెల 13వ తేదీన ‘వైద్యురాలి అత్యాస..!’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి వైద్య విధాన్‌ పరిషత్‌ అధికారులు స్పందించారు. దీనిపై ఇద్దరు అధికారులతో విచారణ జరిపారు. వైద్యురాలు చైతన్య స్రవంతితో ఉద్యోగం చేస్తున్నట్టు తీసుకున్న జీతంతోపాటు, పీజీ చదువుతున్నట్టు తీసుకున్న స్టైఫండ్‌ను రికవరీ చేసినట్టు డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఎన్‌.పద్మశ్రీరాణి బుధవారం తెలిపారు.

వినియోగదారులతో మర్యాదగా మెలగాలి

జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌

విజయనగరం ఫోర్ట్‌: గ్యాస్‌ డెలవరీబాయ్స్‌ వినియోగదారులతో మర్యాదగా మెలగాలని జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో బుధవారం పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్‌ దుకాణదారులు, గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌ విని యోగదారులతో ఎల్లప్పుడూ సత్ప్రవర్తనతో మెలగాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. నెగిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వచ్చిన వారికి సంబంధించి వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశామన్నారు. భవిష్యత్తులో ప్రతికూల స్పందనలు వస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ మురిళీనాథ్‌ పాల్గొన్నారు.

పార్వతీపురం: రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో అసంతృప్తిదారులతో ఈనెల 29న ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ముఖాముఖిలో పార్వతీ పురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు, తహసీల్దార్‌లు, రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంటా రన్నారు. ముఖాముఖికి విచ్చేసే అర్జీదారులు గ్రీవెన్స్‌ రశీదు, ఎండార్స్‌మెంట్‌ కాపీని తీసుకు ని రావాలని సూచించారు.

నేడు భగీరథ మహర్షి జయంతి

భగీరథ మహర్షి జయంతి వేడుకలను గురువా రం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు జిల్లా యంత్రాంగం ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, కార్యక్ర మం విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement